Ashwini Vaishnaw: తమిళం మధురమైన భాష... మన దేశ ఆస్తి, ప్రపంచ ఆస్తి కూడా
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:48 AM
కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘తమిళం ఒక తియ్యటి భాష. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. తమిళం మన దేశ ఆస్తి మాత్రమే కాదు... ప్రపంచ ఆస్తి కూడా.

మనం గర్వించాల్సిన విషయం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
చెన్నై, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘కాన్పూర్ ఐఐటీలో చదువుతున్న సమయంలో పరిచయమైన ఆచార్య శఠగోపన్ నాకు తమిళం నేర్పించారు. తమిళం మధురమైన భాష’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘తమిళం ఒక తియ్యటి భాష. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. తమిళం మన దేశ ఆస్తి మాత్రమే కాదు... ప్రపంచ ఆస్తి కూడా. అందుకే మనం గర్వపడాలి. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి. ఆ స్ఫూర్తితోనే ప్రధాని పనిచేస్తున్నారు. దేశంలో మాట్లాడే ప్రతి భాషకూ సముచిత స్థానం కల్పించడంతో పాటు తగిన గౌరవం కల్పించేలా ప్రధాని వ్యవహరిస్తున్నారు. విభిన్న నాగరికతల మధ్య మన దేశ సౌభ్రాతృత్వానికి, స్నేహానికి, సంబంధాలకు ఎలాంటి అడ్డంకులు రాకూడదు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను రూపొందించడంతో పాటు మన బలాన్ని ప్రపంచం గుర్తించేలా అందరూ పాటుపడాలి. ఐఐటీ చెన్నై విద్యార్థులు ఇటీవల హైపర్లూప్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ప్రాజెక్ట్ భారతీయ రైల్వేకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.