Air India Flight: గాల్లో ఉండగా సాంకేతిక లోపం.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 07:59 AM
Air India Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన రెండవ రోజే మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. జూన్ 14వ తేదీన బోయింగ్ 777 విమానం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వియన్నా బయలుదేరింది.
ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 జూన్ 12వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై పడి పేలి పోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. హాస్టల్లోని స్టూడెంట్స్.. ప్రమాదం జరిగినపుడు సంఘటనా స్థలంలో ఉన్న కొంతమంది జనాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాదం జరగడానికి గల సరైన కారణాలు ఏంటో తెలియరాలేదు.
అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన రెండవ రోజే ఓ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. జూన్ 14వ తేదీన బోయింగ్ 777 విమానం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వియన్నా బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆల్టిట్యూడ్ సమస్య కారణంగా ఠక్కున 900 అడుగులు కిందకు వచ్చేసింది. అదృష్టం బాగుండి ఎలాంటి దారుణం జరగలేదు. క్షేమంగా వియన్నా చేరుకుంది. 9 గంటల 8 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంది.
కాగా, సాంకేతిక లోపం తలెత్తిన బోయింగ్ 777 విమానం పైలట్స్ ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీజీసీఏ చర్యలకు సిద్ధమైంది. ఎయిర్ క్రాఫ్ట్ రికార్డ్స్ డేటాను తెప్పించుకుంది. దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బోయింగ్ 777 పైలట్స్ విధులకు దూరంగా ఉన్నారు. దర్యాప్తులో బయటపడే విషయాలను బట్టి వారికి విధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్..10గంటలనుంచి విద్యుత్ సరఫరా బంద్