Wall Collapse : గోడకూలి ఏడుగురు మృతి, మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:37 PM
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలకు గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం..
ఢిల్లీ, ఆగష్టు 9: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలకు గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని హరినగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 8మందిని స్థానికులు, పోలీసులు రక్షించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత రాత్రి భారీగా కురిసిన వర్షం కారణంగా హరి నగర్లోని జైత్పూర్ ప్రాంతంలో గోడ కూలిపోవడంతో పాత ఆలయం పక్కనే ఉన్న జగ్గీలలో నివసిస్తున్న వాళ్లు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జగ్గీలను ఖాళీ చేయించామని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ ఐశ్వర్య శర్మ తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక బృందాలు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యను ప్రారంభించాయి. మృతులను షబీబుల్ (30), రబీబుల్ (30), అలీ (45), రుబినా (25), డాలీ (25), రుక్సానా (6), హసీనా (7)గా గుర్తించారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి ఇద్దరు మృతిచెందిన ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ ఇవాళ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. వర్షాల కారణంగా దేశ రాజధానిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, శనివారం ఉదయం 8.30 గంటల వరకు సఫ్దర్జంగ్లోని ఢిల్లీ ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 78.7 మి.మీ., ప్రగతి మైదాన్లో 100 మి.మీ., లోధి రోడ్లో 80 మి.మీ., పూసాలో 69 మి.మీ., పాలంలో 31.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అటు, యమునా నది నీటి మట్టం కూడా ప్రమాదకర స్థాయి 204.50 మీటర్లకు చేరుకుంది. ఓల్డ్ రైల్వే వంతెన దగ్గర ఉదయం 9 గంటలకు నీటి మట్టం 204.40 మీటర్లు ఉంది. దీంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.