Cold water bottles: కనుచూపు మేర ఇసుక తిన్నెలు.. ఎడారిలో గొంతు తడారిపోతే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:04 AM
నమీబియాలోని ‘నమీబి’ ఎడారిలో ‘పింక్ ఫ్రిజ్’ అనేది ఓ టూరిస్టు ప్లేస్. దానిని ఎడారి యాత్రికుల కోసం అక్కడి ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. క్రమం తప్పకుండా అందులో నీళ్ల బాటిళ్లు, ఐస్ టీ, కాఫీ బాటిళ్లు పెడుతుంటారు. ఆ దారిలో వెళ్లే వాళ్లంతా వాటిని తాగొచ్చు ఉచితంగా. పైగా అక్కడ రెండు గులాబీ కుర్చీలు, టేబులూ వేసి ఉంటాయి.
కనుచూపు మేర ఇసుక తిన్నెలు... గుప్పెడు నీళ్ల కోసం అన్వేషిస్తూ కిలోమీటర్ల దూరం ప్రయాణించినా నిరాశే. దూరంగా ఓ చిన్న గుట్టమీద గులాబీ రంగులో ఏదో ఆకృతి... కాస్త పరికించి చూస్తే అదో ఫ్రిజ్. ప్రాణాలను ఒడిసిపట్టి, అటు వైపు వెళుతుంటే ఎన్నో ప్రశ్నలు. అది నిజంగా ఫ్రిజ్జా లేక బొమ్మా? అందులో నీళ్లు ఉంటాయా? ... ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూనే దగ్గరకు వెళ్లి ఫ్రిజ్ డోర్ తీస్తే... ఆశ్చర్యం చల్లని నీళ్ల బాటిళ్లు.
నమీబియాలోని ‘నమీబి’ ఎడారిలో ‘పింక్ ఫ్రిజ్’ అనేది ఓ టూరిస్టు ప్లేస్. దానిని ఎడారి యాత్రికుల కోసం అక్కడి ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. క్రమం తప్పకుండా అందులో నీళ్ల బాటిళ్లు, ఐస్ టీ, కాఫీ బాటిళ్లు పెడుతుంటారు. ఆ దారిలో వెళ్లే వాళ్లంతా వాటిని తాగొచ్చు ఉచితంగా. పైగా అక్కడ రెండు గులాబీ కుర్చీలు, టేబులూ వేసి ఉంటాయి.
టూరిస్టులు చల్లని నీళ్లు తాగుతూ, ఆ కుర్చీల్లో కూర్చుని సేదతీరాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అదో చిన్న కొండ కాబట్టి అక్కడి నుంచి ఎడారంతా కనిపిస్తుంది. సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ప్రతీరోజూ సాయంత్రం అయ్యేసరికి ఫ్రిజ్ ఖాళీ అవుతుంది. సోలార్తో నడిచే ఈ ఫ్రిజ్ను మొదట్లో టూరిస్టులు అనుమానంగా చూసేవారట. కాలక్రమంలో ప్రభుత్వం చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ చాలామంది సోషల్ మీడియాలో పింక్ ఫ్రిజ్ గురించి విశేషాలు పోస్ట్ చేయడం మొదలెట్టారు. దాంతో నమీబియా వెళ్లేవాళ్లు పింక్ ఫ్రిజ్ని తమ ఐటినరీగా తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ఫ్రిజ్తో ఫొటోలు దిగుతున్నారు.