US Warns India of Higher Tariffs: పుతిన్, ట్రంప్ భేటీ విఫలమైతే.. భారత్పై మరిన్ని సుంకాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:13 AM
ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై రష్యా, అమెరికా మధ్య చర్చలు విఫలమైతే.. భారత్పై సుంకాలు మరింతగా పెంచుతామని అమెరికా;....
రష్యా నుంచి చమురు కొంటున్నందుకే.. రష్యాపై ఆంక్షలు కఠినం చేస్తాం
చైనా విషయంలో ఏం చేయాలో డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసు
యూఎస్ మంత్రి స్కాట్ బెస్సెంట్ వ్యాఖ్యలు
పరస్పర ప్రయోజనాల మేరకు అమెరికాతో సంబంధాలు: రణ్ధీర్ జైస్వాల్
ట్రంప్, పుతిన్ భేటీ విఫలమైతే..
న్యూయార్క్, ఆగస్టు 14: ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై రష్యా, అమెరికా మధ్య చర్చలు విఫలమైతే.. భారత్పై సుంకాలు మరింతగా పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుండటమే దీనికి కారణమని చెప్పారు. అమెరికాలోని అలాస్కాలో శుక్రవారం(భారత కాలమానం ప్రకారం శనివారం) రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్ తీరుతో అందరూ విసిగిపోయి ఉన్నారు. ఈసారి ఆయన సానుకూల చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్, పుతిన్ చర్చలు సఫలం కాకపోతే.. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై సుంకాలు మరింతగా పెంచుతాం. రష్యాపై ఆంక్షలు కఠినతరం చేస్తాం’’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువ చమురు కొంటున్న చైనా సంగతి ఏమిటని విలేకరి ప్రశ్నించగా.. అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందే తానేమీ చెప్పలేనని, ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసని స్కాట్ బెస్సెంట్ చెప్పారు. రష్యాపై మరింత ఒత్తి తెచ్చేందుకు యూరోపియన్ దేశాలు అమెరికా వెంట నిలవాలని కోరారు. మరోవైపు, అమెరికా, భారత్ మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా ముందుకు సాగుతాయని, మెరుగుపడతాయని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, కొన్ని సమయాల్లో అది సవాళ్లను ఎదుర్కొన్నా ముందుకు సాగిందని చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి అమెరికా, భారత్ మధ్య బలమైన బంధం ఉందని.. ఇది ద్వైపాక్షిక సంబంధాలకు కీలక ఆధారమని తెలిపారు.