OPT Students: ఓపీటీ విద్యార్థులపై ట్రంప్ సర్కారు కన్ను
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:37 AM
ఇన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపైనే దృష్టి పెట్టిన ట్రంప్ సర్కారు.. తాజాగా ఆ దేశంలో ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ..
విద్యార్థుల నివాసాలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
వారి ఐ-983 ఫామ్లు, ఇతర పత్రాల పరిశీలన
స్టెమ్ ఓపీటీలో దాదాపు లక్ష మంది భారతీయ విద్యార్థులు!
వాషింగ్టన్, సెప్టెంబరు 26: ఇన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపైనే దృష్టి పెట్టిన ట్రంప్ సర్కారు.. తాజాగా ఆ దేశంలో ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రాంలో ఉన్న విద్యార్థులపై నిఘా పెంచింది! ముఖ్యంగా.. రెండేళ్ల స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్) ఓటీపీ ఎక్స్టెన్షన్లో ఉన్న విద్యార్థుల ఇళ్లు, హాస్టళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు చట్టబద్ధం, సహజమేగానీ.. ఇప్పుడు వాటిని విస్తృతంగా, పెద్ద ఎత్తున చేపడుతుండడమే చర్చనీయాంశంగా మారింది. 2023-24 నాటి ఓపెన్డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. 97,556 మంది ఓపీటీ ప్రోగ్రామ్లో ఉన్నారు. వారిలో అత్యధికులు స్టెమ్ ఓపీటీలో ఉన్నారు. సాధారణ ఓపీటీ 12 నెలలు మాత్రమే ఉంటుంది. అదే స్టెమ్ విద్యార్థులైతే.. అదనంగా మరో 2 సంవత్సరాల ఓపీటీ పొందగలరు. అంటే.. మొత్తం మూడేళ్ల పని అనుభవం వారికి లభిస్తుంది. అలా స్టెమ్ ఓపీటీపై ఉన్నవారంతా అధికారుల నిఘానేత్రం పరిధిలో ఉన్నట్టే. వారి ‘ఫామ్-ఐ983ని తనిఖీ చేసే అధికారం.. యూఎస్ సిటిజన్షి్ప అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎ్స)లోని ‘ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ (ఎఫ్డీఎన్ఎ్స)’ విభాగం అధికారులకు ఉంటుంది. స్టెమ్ ఓపీటీలో ఉన్నవారు సంబంధిత రంగంలోనే శిక్షణ పొందుతున్నారా లేదా? వారి ఎఫ్-1 వీసా హోదా అమల్లో ఉందా లేదా? తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే అధికారులు తాను ఉన్న చోటుకు అకస్మాత్తుగా వచ్చి.. తన పత్రాలు పరిశీలించారని, మరిన్ని ధ్రువపత్రాలు చూపించాల్సిందిగా కోరారని ఇటీవలే స్టెమ్ ఓపీటీకి అనుమతి పొందిన ఒక విద్యార్థి తెలిపాడు. పలు వర్సిటీల హాస్టళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు మరో విద్యార్థి వివరించాడు. ట్రంప్ సర్కా రు ఇకపై ఈ తనిఖీలను మరింత విస్తృతం చేస్తుందని ఫ్లోరిడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ అశ్విన్ శర్మ అభిప్రాయపడ్డారు. కాబట్టి విద్యార్థులంతా తమ పత్రాలను ఎప్పటికప్పుడు అప్-టు-డేట్గా ఉంచుకోవాలని.. అధికారులు వచ్చినప్పుడు ఆందోళనకు గురి కావొద్దని, ప్రశాంతంగా ఉండాలని, వారు అడిగిన ప్రశ్నలకు నిజాయతీగా జవాబులు చెప్పాలని సూచించారు.