SkyWest Airlines: గాలిలో విమానం హైజాక్.. భయాందోళనకు గురైన పైలట్లు
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:33 AM
విమానం బయలుదేరిన కొద్ది సేపటికి కాక్ పిట్ను బలంగా బాదుతున్నారు. దీంతో పైలట్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారికి ఏం జరుగుతుందో తెలియలేదు.
వాషింగ్టన్, అక్టోబర్ 22: పైలట్ల పొరపాటు కారణంగా విమానం బయలుదేరిన జస్ట్ 40 నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 7.45 గంటలకు అమెరికా ఎయిర్లైన్స్ స్కైవెస్ట్కు చెందిన విమానం లాస్ఏంజెలెస్కు బయలుదేరింది. ఆ కొద్దిసేపటికే ఇంటర్కామ్ ఫోన్లో సమస్య ఏర్పడింది. దీంతో విమాన సిబ్బందితో మాట్లాడేందుకు పైలెట్ల ప్రయత్నించారు. కానీ వారితో మాట్లాడడం సాధ్యం కాలేదు.
అలాగే పైలట్లతో మాట్లాడేందుకు విమాన సిబ్బంది సైతం ప్రయత్నించారు. ఆ క్రమంలో విమాన సిబ్బంది కాక్ పిట్ డోర్ కాస్తా బలంగా కొట్టారు. దీంతో పైలట్లు ఎవరో కాక్పిట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు డోర్ కొడుతున్నారని.. వారు విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారని విమానంలోనిపైలట్లు భావించారు. వెంటనే విమానాన్ని నెబ్రస్కాలో ఒమాహాలోని ఎప్లీ ఎయిర్ఫీల్డ్లో దించారు.
అనంతరం ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే విమాన సిబ్బందే కాక్ పిట్ డోర్ కొట్టారన్న విషయం తెలుసుకొని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్కామ్లో ఏర్పడిన సమ్యస కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఫెడరల్ ఏవియేషన్ ప్రకటించింది. విమానంలో ఏదో జరుగుతుందని తాము భావించామని.. అందుకే ఎమర్జెన్సీ ల్యాండ్ చేశామంటూ ప్రయాణికులను పైలట్ల క్షమాపణలు కొరారు.