Ukraine Missile Restrictions: దాడులకు ఉక్రెయిన్ 18 నెలల కార్యాచరణ
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:37 AM
ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల షరతుల వల్ల రష్యా భూభాగంపై దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించలేకపోయింది. దీంతో ఎస్బీయూ డ్రోన్లతో రష్యా వ్యతిరేకంగా ‘ఆపరేషన్ వెబ్’ను నిర్వహించి, నాలుగు రష్యా వైమానిక స్థావరాలకు తీవ్ర దెబ్బలు తగిలించారు.
ఉక్రెయిన్ వద్ద అధునాతన దీర్ఘశ్రేణి క్షిపణులున్నాయి. అయితే.. వాటిని రష్యా భూభాగంపై ప్రయోగించకూడదని పాశ్చాత్య దేశాలు ముందుగానే షరతు విధించాయి. దీంతో.. రష్యా గడ్డ మీది నుంచే ఆ దేశాన్ని దెబ్బతీయాలని ఎస్బీయూ నిర్ణయించింది. 18 నెలల క్రితమే ‘ఆపరేషన్ వెబ్’కు శ్రీకారం చుట్టింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు/సుప్రీం కమాండర్-ఇన్-చీ్ఫ జెలెన్స్కీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. వేర్వేరు దేశాల నుంచి రష్యాకు వెళ్లే ట్రక్కులనే డ్రోన్లను చేరవేయడానికి ఎస్బీయూ పథకం పన్నింది. రష్యాలో.. ఉక్రెయిన్కు సుదూరంగా ఉండే ఎయిర్ బేస్ల వరకు వాటిని తరలించింది. రష్యా ఫెడరల్ భూభాగంలో ట్రక్కులపైన రిమోట్తో తెరుచుకునే చెక్క పెట్టెల్లో.. ఇళ్ల పైకప్పులపైన మోహరించింది. అందుకే గతంలో ఉక్రెయిన్ సైన్యం ‘లాజిస్టిక్ కోణంలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను నిర్వహిస్తాం’ అని ప్రకటించింది. ఎఫ్పీవీ డ్రోన్లు సైజులో చిన్నగా ఉన్నా.. దాడి జరిగే వరకు టార్గెట్ల వీడియోను స్పష్టంగా చిత్రీకరిస్తాయి. ఉక్రెయిన్ ఎస్బీయూ కమాండ్ కంట్రోల్కు సమాచారాన్ని చేరవేస్తాయి. కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా దాడులు జరపడమేకాకుండా.. టార్గెట్పై ఆత్మాహుతి దాడి చేస్తాయి. ఆదివారం రిమోట్ ద్వారా డ్రోన్ల పైకప్పులను తొలగించిన ఎస్బీయూ.. ఏకకాలంలో వాటిని ప్రయోగించి, రష్యాకు చెందిన నాలుగు వైమానిక స్థావరాలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి