U S President Trump: భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:12 AM
భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియాలోని గియోంగ్జులో జరుగుతున్న..
మోదీ చాలా బాగుంటారు.. కానీ మొండి ఘటం
ఏపీఈసీ సదస్సులో ట్రంప్ వ్యాఖ్యలు
భారత్కు చమురు తెస్తూ వెనక్కి మళ్లిన రష్యా ట్యాంకర్ నౌక
టోక్యో/సియోల్, అక్టోబరు 29: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియాలోని గియోంగ్జులో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక భాగస్వామ్య(ఏపీఈసీ) సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టేననే వార్తల నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ట్రంప్ డిమాండ్ మేరకు రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుంటుండటం గమనార్హం. ట్రంప్ ఆంక్షలు విధించిన రష్యా చమురు కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపివేశామని ఇప్పటికే రిలయన్స్, ఐఓసీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా రష్యా నుంచి భారీగా చమురుతో భారత్వైపు వస్తున్న ది ఫ్యూరియా అనే ట్యాంకర్ నౌక బాల్టిక్ సముద్ర ప్రాంతంలో వెనక్కి మళ్లింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైందనే దానికి ఇది సంకేతమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
భారీగా చమురు నింపుకొని వస్తున్నా..
ఈ ట్యాంకర్ నౌక అక్టోబరు 20న రష్యాలోని ప్రైమోర్స్క్ పోర్టు నుంచి సుమారు 7.3 లక్షల బ్యారెళ్ల చమురుతో బయలుదేరిందని, కానీ మంగళవారం యూటర్న్ తీసుకుందని సముద్ర రవాణాను పర్యవేక్షించే కెప్లర్ సంస్థ తెలిపింది. కొంతదూరం వెనక్కి వెళ్లాక సముద్రంలోనే నిలిచిపోయిందని వెల్లడించింది. భారత్లోని హెచ్పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ సంస్థల ఉమ్మడి కంపెనీ హెచ్ఎంఈఎల్కు ఈ చమురు సరఫరా కావాల్సి ఉందని సమాచారం. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు హెచ్ఎంఈఎల్ బుధవారం ప్రకటించింది.
మోదీలాంటి తండ్రి ఉంటే బాగుంటుంది
ప్రధాని మోదీపై ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ‘‘మోదీ చాలా బాగుంటారు. ఆయన లాంటి తండ్రి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన ఒక కిల్లర్. మహా మొండి ఘటం’’ అని పేర్కొన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను గొప్ప వ్యక్తి, గొప్ప పోరాట యోధుడు అని ట్రంప్ అభివర్ణించారు. ఇక భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తమను యుద్ధం చేసుకోనివ్వాలని మొదట ఇరు దేశాల అధినేతలు కోరారని, కానీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి యుద్ధం నిలిపేస్తున్నట్టు చెప్పారని ట్రంప్ చెప్పారు. భారత్-పాక్ మధ్య పరస్పర దాడులు కొనసాగిన మే 7-10 తేదీల మధ్య ఏడు సరికొత్త యుద్ధ విమానాలు కూలిపోయాయని అన్నారు.