US President Trump: ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్, చైనా నుంచే నిధులు
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:50 AM
ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి రష్యాకు అవసరమైన నిధులు భారత్, చైనా దేశాల నుంచే అధికంగా వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు...
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్
న్యూయార్క్, సెప్టెంబరు 23: ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి రష్యాకు అవసరమైన నిధులు భారత్, చైనా దేశాల నుంచే అధికంగా వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్, చైనా చమురు కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్కరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ట్రంప్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన పెట్టుబడిదారులంటూ ధ్వజమెత్తారు. నాటో సభ్య దేశాలు కూడా రష్యా నుంచి చమురు, ఇంధన ఉత్పత్తుల కొనుగోళ్లను తగ్గించుకోకపోవడం క్షమించకూడని విషయమన్నారు. నాటో దేశాలు తమపై జరిగే యుద్ధానికి తామే నిధులు ఇస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా సిద్ధంగా లేదని, ఈ నేపథ్యంలో రక్తపాతాన్ని ఆపేందుకు మరోసారి భారీ ఎత్తున సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ కొన్ని యూరోపియన్ దేశాలు చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలకు గుర్తింపునిచ్చినట్టు అవుతుందని పేర్కొన్నారు.