Share News

TikTok Fuels Nepals Digital Youth: అగ్నికి టిక్‌ టాక్‌ ఆజ్యం

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:11 AM

నేపాల్‌ను కుదిపేస్తున్న డిజిటల్‌ యువ ఆందోళనలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘టిక్‌టాక్‌’ మరింత ఆజ్యం పోసింది..

TikTok Fuels Nepals Digital Youth: అగ్నికి టిక్‌ టాక్‌ ఆజ్యం

కఠ్మాండూ, సెప్టెంబరు 9 : నేపాల్‌ను కుదిపేస్తున్న డిజిటల్‌ యువ ఆందోళనలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘టిక్‌టాక్‌’ మరింత ఆజ్యం పోసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, టిక్‌టాక్‌లోని ‘న్యూ నేపాల్‌’ అనే ఖాతాలో పోస్టు అయిన పలు ఫొటోలు, వ్యాఖ్యానాలు సోమవారం జరిగిన పార్లమెంటు ముట్టడిని ప్రేరేపించాయి. నేపాల్‌లో నిషేధం నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క సామాజిక మాధ్యమం ‘టిక్‌ టాక్‌’. ఇందులో ‘సెప్టెంబరు 8’ అనే శీర్షికతో పార్లమెంటు ఫొటోను ‘న్యూ నేపాల్‌’ పోస్టు చేసింది. అలాగే, తగలబడిపోతున్న పార్లమెంటు.. మంటలు ఆర్పుతున్న సిబ్బందికి చెందిన మరో ఫొటోను కూడా పోస్టు చేసింది.

ఎవరీ సుదన్‌ గురుంగ్‌?

సోషల్‌ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్‌లో బద్దలైన ఆందోళనల నేపథ్యంలో తెరపైకి వచ్చిన పేరు సుదన్‌ గురుంగ్‌ (36). ఈయన నడుపుతున్న ఎన్‌జీవో సంస్థ ‘హమీ నేపాల్‌’... నేపాల్‌ ఆందోళనలకు నాయకత్వం వహిస్తోంది. డిజిటల్‌ కట్టడితో మొదలైన ఉద్యమం గురుంగ్‌ చొరవతో ఇప్పుడు పౌర ఉద్యమంగా రూపుదాల్చింది. నేపాల్‌లో శాంతియుత ఆందోళనలకు పిలుపునిస్తూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటినుంచీ పోస్టులు పెడుతూ వచ్చారు. అంతేకాదు, ఆందోళనలు మొదలయితే.. ఏఏ మార్గాలు పోరాటాలకు అనుకూలం, ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండాలనేది ముందస్తుగానే గురుంగ్‌ సూచించేవారు. గురుంగ్‌ పేరు నేపాల్‌లో తొలిసారి 2015 భూకంపం సమయంలో వినిపించింది. ఆ భూకంపంలో సొంత కుమారుడిని ఆయన కోల్పోయారు. ఆ ఘటన తర్వాత ఎన్‌జీవోను పెట్టారు. ఈవెంట్‌ మేనేజర్‌గా చేస్తున్న పనిని మానివేసి పూర్తికాలం పౌర ఉద్యమకారుడిగా మారారు.

Updated Date - Sep 10 , 2025 | 05:11 AM