US Military: ఏ క్షణమైనా వెనెజువెలాపై దాడి
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:31 AM
కరీబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్మ్జుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనెజువెలాపై...
డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకేనంటున్న ట్రంప్
కరీబియన్ సముద్రంలో యుద్ధనౌకల మోహరింపు
ప్యూర్టోరికో ఎయిర్బేస్కు ఎఫ్-35 యుద్ధ విమానాలు
హింసతో అధికార మార్పిడికి అమెరికా యత్నం
వెనెజువెలా అధ్యక్షుడు మాడ్యురో ఆరోపణ
అమెరికా దాడి చేస్తే సాయుధ పోరు తప్పదని హెచ్చరిక
వాషింగ్టన్, సెప్టెంబరు 7: కరీబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్మ్జుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనెజువెలాపై దాడులకు సిద్ధమవుతున్నారు. కరీబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు,అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4,500 మంది సైనికులతో ఎనిమిది యుద్ధనౌకలు కరీబియన్ సముద్రంలోకి వెళ్లాయి. ఏవీ-8బీ హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైన యూఎ్సఎస్ జాన్సన్ డున్హమ్, యూఎస్ఎస్ గ్రేవ్లీలను దక్షిణ కరీబియన్లో మోహరించారు. ఒక్కో డెస్ట్రాయర్లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ లేక్ ఎరి, మిన్నియాపొలిస్ సెయింట్ పాల్లను కూడా వెనెజువెలాపై గురిపెట్టి ఉంచారు. శుక్రవారం రాత్రి 10 ఎఫ్-35 యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని వైమానిక స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనెజువెలాపై దాడులు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. వెనెజువెలాలోని డ్రగ్స్ ముఠాల నుంచి మాదకద్రవ్యాలు అమెరికాలోకి విపరీతంగా వస్తున్నాయని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతమొందించేందుకు సైనికదళాలను రంగంలోకి దింపారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ సర్కారు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. మాడ్యురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదంటూ ఇటీవలే శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. తాజాగా డ్రగ్స్ బోటు అంటూ వెనెజువెలాకు చెందిన ఓ పడవను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు.
ఈ చర్యను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించుకున్నారు. అమెరికా పౌరులకు మాదకద్రవ్యాలనే విషాన్ని అలవాటు చేస్తున్న 11 మంది డ్రగ్స్ ముఠా సభ్యులను అంతమొందించారని, దీంతో అమెరికా సైన్యాన్ని చాలా చక్కగా వాడుకున్నట్లయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా, అమెరికా మోహరింపులను మాడ్యురో తప్పుపట్టారు. హింసతో అధికార మార్పిడి జరపాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను మానుకోవాలని అన్నారు. తమ సార్వభౌమత్వాన్ని, శాంతి హక్కును, స్వాతంత్ర్యాన్ని అమెరికా తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. ‘నేను ట్రంప్ను గౌరవిస్తా. మా మధ్య ఉన్న విభేదాలు సైనిక పోరుగా మారకూడదు’ అని మాడ్యురో పేర్కొన్నారు. వెనెజువెలా ఎప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటుందన్నారు. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో మాడ్యురో కూడా 3.40 లక్షల మంది సైనికులను సిద్ధం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తమ దేశంపై దాడి చేస్తే వెంటనే సాయుధ పోరు మొదలవుతుందని మాడ్యూరో ప్రకటించారు.