Dassault CEO: రాఫెల్ జెట్లు కూలలేదు.. పాక్ ప్రకటన అబద్ధం
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:52 AM
భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ జెట్లను కూల్చివేశామన్న పాకిస్థాన్ ప్రకటనను దసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ ఖండించారు. నిర్దిష్ట ఆధారాలు లేకుండా పాక్ ఆ ప్రకటన చేసిందన్నారు.
‘దసో’ సీఈవో ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 15: భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ జెట్లను కూల్చివేశామన్న పాకిస్థాన్ ప్రకటనను దసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ ఖండించారు. నిర్దిష్ట ఆధారాలు లేకుండా పాక్ ఆ ప్రకటన చేసిందన్నారు. రాఫెల్స్ కూల్చివేత వాస్తవం కాదని స్పష్టం చేశారు. చాలామందిని వాస్తవం దిగ్ర్భాంతికి గురిచేస్తుందని ఎరిక్ వ్యాఖ్యానించారు. ఓ యూరోపియన్ పబ్లికేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్కు చెందిన దసో సంస్థ రాఫెల్ జెట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్స్ను కోల్పోయినట్టు భారత్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అసలు ఏం జరిగిందనేది స్పష్టత లేదు. పాక్ చెబుతున్నట్టు రాఫెల్స్ను కూల్చడం పూర్తిగా అవాస్తవం. అయినా, పూర్తి వివరాలు అందితేనే వాస్తవం ఏమిటనేది తెలుస్తుంది. నష్టాలు లేకుండా యుద్ధాలు ఉండవు’’ అని ఎరిక్ అభిప్రాయపడ్డారు.