Cyclone Dithwa: తుఫాను ప్రభావం.. శ్రీలంకలో 212మంది మృతి
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:51 AM
శ్రీలంకలో దిత్వా తుఫాను మృతుల సంఖ్య 212కు చేరింది. మరో 218 మంది గల్లంతయ్యారని శ్రీలంక విపత్తుల నిర్వహణ కేంద్రం...
కొలంబోలో చిక్కుకుపోయిన 400 మంది భారతీయులు
కొలంబో, నవంబరు 30: శ్రీలంకలో దిత్వా తుఫాను మృతుల సంఖ్య 212కు చేరింది. మరో 218 మంది గల్లంతయ్యారని శ్రీలంక విపత్తుల నిర్వహణ కేంద్రం(డీఎంసీ) ఆదివారం ప్రకటించింది. 2,73,606 కుటుంబాలకు చెందిన 9,98,918 మంది ప్రజలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపినట్టు డీఎంసీ పేర్కొంది. భారత ప్రభుత్వ సాయంతో శ్రీలంక ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగిస్తోంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శ్రీలంక అధికారులకు భారత వాయుసేన(ఐఏఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సాయం చే స్తున్నారని భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, కొలంబోలోని విమానాశ్రయంలో చిక్కుకుపోయిన సుమారు 400 మంది భారతీయులను ఆదివారం స్వదేశానికి తరలించారు. వీరిలో సుమారు 150 మందిని సీ130 విమానంలో ఢిల్లీకి పంపించారు. మిగిలిన 250 మందిని ఐఎల్76 విమానంలో కేరళలోని తిరువనంతపురానికి తరలించారు.