BJP: నేపాల్ పై ఎవరూ మాట్లాడొద్దు
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:39 AM
నేపాల్ పరిణామాలపై ఎవరూ మాట్లాడొద్దు అని, ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి...
శ్రేణులకు బీజేపీ గట్టి ఆదేశాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: నేపాల్ పరిణామాలపై ఎవరూ మాట్లాడొద్దు అని, ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి పొందాలని తన శ్రేణులకు బీజేపీ అధిష్ఠానం గట్టి ఆదేశాలు జారీచేసింది. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధురీ నేపాల్పై చేసి న వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పిగా మారడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. ‘నేపాల్ పరిణామాలకు కాంగ్రెస్సే కారణం. ఈ దేశాలను విడగొట్టి కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది. అదేగనుక భారత్లో భాగంగా ఉన్నట్టయితే నేపాల్ శాంతి, సంతోషాలతో నిండి ఉండేది’’ అంటూ సామ్రాట్ చౌధురీ వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. దీంతో కేంద్ర మంత్రులు, ఎంపీలు, నాయకులు, కార్యనిర్వాహక వర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా నిర్వాహకులు సహా ఎవరూ నేపాల్పై నోరెత్తవద్దని అధిష్ఠానం తేల్చిచెప్పినట్టు బీజేపీ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆన్లైన్ మీడియా కథనం ప్రసారం చేసింది. కాగా, నేపా ల్ పరిణామాలను లోతుగా పరిశీలిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. నేపాల్ ఆందోళనల్లో యువకుల మరణాలు బాధించాయని పేర్కొంది.