Bangladesh unrest: బంగ్లాదేశ్ మళ్లీ అగ్నిగుండంవిద్యార్థి నాయకుడు హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:26 AM
బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండమైంది. ఢాకాలో ఈ నెల 12న గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడిన భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్.....
హిందూ యువకుడిని కొట్టి చంపిన మూకలు
చెట్టుకు వేలాడదీసి మృతదేహానికి నిప్పు
ఢాకా, న్యూఢిల్లీ, డిసెంబరు 19: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండమైంది. ఢాకాలో ఈ నెల 12న గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడిన భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్, విద్యార్థి నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ(32) గురువారం సింగపూర్లో మృతి చెందడంతో బంగ్లాదేశ్లో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులు చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారత్తో పాటు మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబీర్ రహమాన్ నివాసం(మ్యూజియం)తో పాటు, అవామీలీగ్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టారు. ఢాకా, చిట్టగాంగ్, రాజ్షాహి తదితర జిల్లాల్లో హైవేలను దిగ్బంధించారు. అల్లరిమూకలు పలు మీడియా సంస్థలపై దాడులు చేశాయి. ఢాకాలోని కవ్రాన్ బజార్లో ఉన్న డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించి 25 మంది జర్నలిస్టులను కాపాడారు. ఆందోళనకారులు బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయంపై కూడా దాడికి పాల్పడ్డారు. న్యూఏజ్ పత్రిక ఎడిటర్ కబీర్పై దుండగులు దాడి చేయడంతో బంగ్లాదేశ్లోని పలు మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను శుక్రవారం నిలిపివేశాయి.
దైవ దూషణకు పాల్పడ్డాడని..
దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఢాకాలో ఆందోళనకారులు దీపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపారు. అనంతరం మూమెన్సింగ్ హైవేపై ఓ చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టారు. మరోవైపు హిందూ యువకుడిపై మూకదాడి, హత్య ఘటనను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని సూచించింది. అటు బంగ్లాదేశ్లో భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని భారతీయులకు సూచించింది. అత్యవసర సాయం కోసం హైకమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
పోలీసుల అదుపులో షూటర్ ఫైసల్ కరీం
భారత్ను తీవ్రంగా వ్యతిరేకించే షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇటీవల గ్రేటర్ బంగ్లా పేరిట భారత ఈశాన్య రాష్ట్రాలను, పశ్చిమబెంగాల్ను కలిపి మ్యాప్ రూపొందించి ప్రదర్శించడం కలకలం రేపింది. గత ఏడాది జులైలో షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థుల ఉద్యమంలో హాదీది కీలక పాత్ర. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న హాదీపై ఈ నెల 12న ఢాకాలో పట్టపగలే ఫైసల్ కరీం అనే యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన హాదీని మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు తరలించినా లాభం లేకుండా పోయింది. కరీంను, అతడికి సహకరించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సుమారు 20 మందికి హాదీపై కాల్పుల ఘటనతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.