Share News

పెట్టుబడుల ప్రకటనలతో సరిపోలని ప్రగతి

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:07 AM

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్–-డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశాలను, అంతర్జాతీయ పెట్టుబడుల అవగాహన ఒప్పందాలకు పరిమితం చేయకుండా, పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక...

పెట్టుబడుల ప్రకటనలతో సరిపోలని ప్రగతి

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్–-డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశాలను, అంతర్జాతీయ పెట్టుబడుల అవగాహన ఒప్పందాలకు పరిమితం చేయకుండా, పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక రంగాలలో నిష్ణాతులైన పలువురు ప్రపంచస్థాయి ప్రభావశీలులైన వ్యక్తులతో దీర్ఘకాలిక పరిచయాలు నిలుపుకోవటానికీ, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ప్రపంచ దిశ -దశ ఏమిటి అనే విషయంలో అవగాహన కలగడానికీ అవకాశంగా ఉపయోగించుకోవాలని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా వెల్లడించారు. ఇటీవలి డబ్ల్యుఇఎఫ్ దావోస్ వార్షిక సమావేశంలో, భారత కంపెనీలతో సహా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో పెద్ద ఎత్తున అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కొందరు ముఖ్యమంత్రుల అవాస్తవ ప్రకటనల నేపథ్యంలో ఇలాంటి విశ్లేషణలకు ప్రాముఖ్యత వున్నదనాలి.


డబ్ల్యుఇఎఫ్ స్విట్జర్లాండ్‌లోని ఒక అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థగా 1971 జనవరి 24న జర్మన్ ఇంజనీర్, ఆర్థికవేత్త క్లాస్ స్క్వాబ్ తన 33వ ఏట యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్ పేరుతో స్థాపించారు. దీని లక్ష్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం; వ్యాపార, రాజకీయ, విద్యావేత్తలతో పాటు సమాజంలోని ఇతర ప్రతిభాశీలురైన నాయకులను ఒక ఉమ్మడి వేదిక మీదకు చేర్చి, వార్షిక సదస్సులు నిర్వహించి, ప్రపంచ, ప్రాంతీయ, పారిశ్రామిక విధానాలను రూపొందించడం. ఇటీవల ముగిసిన 54వ డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం జనవరి 15-–19 తేదీల మధ్య దావోస్‌లో జరిగింది.

ఇందులో అంతర్జాతీయ సంస్థల, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశం నుండి గతంలో కంటే అత్యధిక సంఖ్యలో 133 మంది ప్రతినిధులు (‘ఒకే బృందం, ఒక భారతీయ ప్రదర్శన’ అనే థీమ్‌తో) హాజరయ్యారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా, వివిధ రంగాల నుండి సుమారు 100 మంది సీఈఓలు పాల్గొన్నారు.


యూరోపియన్ మేనేజ్‌మెంట్ నిపుణలకు, అమెరికన్ మేనేజ్‌మెంట్ మెళకువలను, విధివిధానాలను నేర్పించడమనే క్లాస్ స్క్వాబ్ ప్రారంభ ఆలోచన క్రమంగా ఆర్థిక, సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడంగా మార్పు చెందింది. 1971 సంవత్సరం నాటి ప్రారంభ సమావేశానికి 400 మంది దిగ్గజ యూరోపియన్ వ్యాపారవేత్తలను, వివిధ రంగ నిపుణులను ఆహ్వానించి, స్క్వాబ్ వ్యూహాత్మకంగా తక్షణ, భవిష్యత్తు నిధులను సమీకరించాడు. స్విస్ ఫెడరల్ ప్రభుత్వ పర్యవేక్షణలో లాభాపేక్షలేని సంస్థగా స్థాపించబడిన డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా సాగుతున్నది.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015లో దాలియాన్‌లో జరిగిన అలాంటి ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొని, తనదైన ప్రత్యేక శైలిలో, తెలంగాణను పెట్టుబడుల స్వర్గంగా ప్రచారం చేయడంలో సఫలమయ్యారు. ఆ సమావేశంలో ఆయన రాజనీతిజ్ఞతతో చేసిన ఉపన్యాసంలో భారత ఆర్థిక వ్యవస్థను సమర్థించడం, చైనా అభివృద్ధిని ప్రశంసించడం, తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలియచేయడం విశేషం.

ప్రత్యేక ఆహ్వానితులకే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనే వీలుంది. ఆర్థిక, రాజకీయ రంగంలో ప్రధాన పాత్రదారులు, క్లిష్టతరమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడం లాంటి డబ్ల్యుఇఎఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోగలిగేవారు సమావేశాలకు ఆహ్వానితులు. పెట్టుబడుల అవకాశాల కోసం తెరవెనుక లాబీయింగ్ చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. బహుశా అందువల్లనే, భారతదేశం నుండి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొంటారు. నియంత్రణల సడలింపునకు, మార్కెట్ స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే ‘నయా ఉదారవాద విధానాల’ వేదికగా డబ్ల్యుఇఎఫ్ మారుతున్నదన్న విమర్శ వస్తున్నది. బహుశా ప్రజల సార్వజనీన, విస్తృత ప్రయోజనాలకు ఈ వేదిక సరిపడకపోవచ్చునేమో. ఏదేమైనా, అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఇది ప్రధాన వేదికే.


నారా చంద్రబాబునాయుడు 1990–-2000 మధ్య కాలంలో, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న తొలి భారతీయ ముఖ్యమంత్రులలో బహుశా ప్రథముడు కావచ్చు. ఆయన ఆ వేదికను చాకచక్యంగా ఉపయోగించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష–పరోక్ష పెట్టుబడుల కేంద్రంగా మలిచారు. హైదరాబాద్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా రూపొందించి, దేశ ఐటీ వృద్ధిలో ఆయన నిర్వహించిన పాత్ర అమోఘం. ఈసారి కూడా చంద్రబాబునాయుడు వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023లోనూ, ఇప్పుడూ కూడా పాల్గొని అమెజాన్, సన్ పెట్రోకెమికల్స్, టిల్‌మన్ గ్లోబల్ హోల్డింగ్స్ వంటి హేమాహేమీ సంస్థల నుండి రూ.1.78లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణకు సాధించారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 49,550 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు ప్రభుత్వ అంచనా. ఇందుకు ముఖ్యమంత్రిని, ఆయన సహచర ప్రతినిధుల బృందాన్ని అభినందించాలి.

ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించేందుకు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పెట్టుబడులను ఆకర్షించేందుకు విశిష్టమైన వేదికగా ఎదుగుతున్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ -ఉపాధి కల్పన వంటి వాస్తవిక ప్రయోజనాలను ఎంతవరకు సాధిస్తున్నదీ అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. చంద్రబాబునాయుడు పాలన చేసిన రోజుల నుండి, ఉమ్మడి అంధ్రప్రదేశ్, తదనంతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు ఈ వేదికను సద్వినియోగం చేసుకుని, బిలియన్‌ డాలర్లలో పెట్టుబడులు పొందినట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు ఎంతమేరకు దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడానికి దోహదపడుతాయనేది కూడా ‘బిలియన్‌ డాలర్ల’ ప్రశ్నే! లేదా, రాజకీయ స్వప్రయోజనాలను ప్రచారం చేసుకోవడానికేనా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.


ఈ నేపథ్యంలో, జనాభా సమస్యను మొట్టమొదట సూత్రీకరించిన విశ్వవిఖ్యాత బ్రిటీష్ ఆర్థికవేత్త రాబర్ట్ థామస్ మాల్థస్ ‘జనాభా సిద్ధాంతాన్ని’ ప్రపంచ ఆర్థిక వేదికలో రాజకీయ నాయకులు ప్రకటించే బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆహారధాన్యాల పెరుగుదల రేటు కంటే జనాభా పెరుగుదల రేటు హెచ్చుగా ఉంటుందని మాల్థస్ తన సిద్ధాంతంలో వివరించాడు. ఆహార ధాన్యాలు అంకశ్రేణిలో పెరిగితే, జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది. అంటే ఆహార ధాన్యాల వృద్ధి అంకశ్రేణి క్రమంలో– అంటే 1, 2, 3, 4, 5... పద్ధతిలో పెరుగుతుంటే, జనాభా వృద్ధి గుణశ్రేణి క్రమంలో– అంటే, 1, 2, 4, 8, 16... పద్ధతిలో పెరుగుతుంది. డబ్ల్యుఇఎఫ్ వేదిక ఆధారంగా జరిగే అవగాహనా ఒప్పందాలు, దరిమిలా అవి కలిగించే వాస్తవ ప్రయోజనాల మధ్య కూడా ఇలాంటి అసమానతలే ఉన్నాయి.

పెట్టుబడుల ప్రకటనలు ఆర్థిక ప్రగతి, అభివృద్ధి, భారీ ఉద్యోగ-–ఉపాధి కల్పనల గురించి ఆశలు రేకెత్తిస్తాయి. కానీ ఈ ప్రకటనల స్థాయిలో వాస్తవిక ఫలితాలు ఉండటం లేదు. నిధుల విడుదల, మౌలిక ప్రాజెక్టుల అమలు, క్షేత్రస్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు సాధించడంలో అనేక నియంత్రణ సమస్యలు, ఆర్థిక అనిశ్చితులు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ అసమానత కారణంగా అభివృద్ధి అంతరం ఏర్పడుతోంది. వాగ్దానాల ప్రకారం ఆర్థిక మార్పు సాధించడంలో విఫలమవ్వడం వల్ల సంశయాలు, విలంబం, విధాన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి పెట్టుబడుల ప్రకటనలు వాస్తవ ప్రగతితో అనుసంధానమయ్యేలా జాగ్రత్తపడాలి.

వనం జ్వాలా నరసింహారావు


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 02:07 AM