Share News

స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ కొత్త ప్లాంట్‌

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:58 AM

హైదరాబాద్‌ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న స్పెషలైజ్డ్‌ ఇంజనీరింగ్‌ ఎక్వి్‌పమెంట్‌ తయారీ కంపెనీ.. స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌.. తెలంగాణలో...

స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ కొత్త ప్లాంట్‌

హైదరాబాద్‌ సమీపంలో ఏర్పాటు

తొలి దశలో రూ.130 కోట్ల పెట్టుబడి

6న పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న స్పెషలైజ్డ్‌ ఇంజనీరింగ్‌ ఎక్వి్‌పమెంట్‌ తయారీ కంపెనీ.. స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌.. తెలంగాణలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు శనివారం నాడిక్కడ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో మొత్తం తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో రూ.130 కోట్ల పెట్టుబడితో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఈ ప్లాంట్‌ను 15 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రావు చెప్పారు. ఈ ప్లాంట్‌లో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎడిబల్‌ ఆయిల్స్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజేస్‌ రంగాలకు అవసరమైన స్పెషలైజ్డ్‌ ఎక్వి్‌పమెంట్స్‌ను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా కంపెనీ ఇప్పటికే హైదరాబాద్‌లో మొత్తం 9 ప్లాంట్లను నిర్వహిస్తోందన్నారు. ఫార్మాస్యూటికల్‌, కెమికల్‌ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ఈ ఏడాది రూ.700 కోట్ల రెవెన్యూ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కంపెనీ రెవెన్యూ రూ.700 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నాగేశ్వర రావు తెలిపారు. 2023-24 లో కంపెనీ రెవెన్యూ రూ.549.68 కోట్లుగా ఉంది. కంపెనీ ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని, రానున్న సంవత్సరాల్లో ఇదే వృద్ధిని కొనసాగించ వచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.450 కోట్లుగా ఉందన్నారు. కాగా కంపెనీలో జపాన్‌కు చెందిన ఏజీఐ గ్లాస్‌ రూ.132 కోట్లు పెట్టుబడిగా పెట్టిందన్నారు.


ఐపీఓ షేరు ధర రూ.133-140

స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) జనవరి 6న ప్రారంభమైన 8న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువతో కూడిన ఒక్కో షేరు ధరను రూ.133-140గా ఖరారు చేసింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.210 కోట్ల మొత్తానికి కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌, ఇతర వాటాదారులు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా రూ.200.05 కోట్ల మొత్తానికి సమానమైన 1,42,89,367 షేర్లను విక్రయించనున్నారు.

Updated Date - Jan 05 , 2025 | 05:58 AM