ఎంఎస్ఎంఈలకు మరింత చేయూత
ABN , Publish Date - Jun 11 , 2025 | 03:20 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు మరింత చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సంస్థలు ఏదైనా కొత్త దేశం లేదా కొత్త ఎగుమతిదారులకు తమ...
ఈయూతో త్వరలోనే ఎఫ్టీఏ : కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
బెర్న్ (స్విట్జర్లాండ్): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు మరింత చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సంస్థలు ఏదైనా కొత్త దేశం లేదా కొత్త ఎగుమతిదారులకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేయాలంటే అందుకు అయ్యే పూర్తి రిజిస్ట్రేషన్ చార్జీలు భరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటలో ఉన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్ ఈ విషయం వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తామన్నారు. ఈ పథకం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)లో భాగంగా ఉంటుందన్నారు. ఎగుమతుల రంగంలో ఉన్న దేశీయ కంపెనీలు విలువ జోడింపు, తమ బ్రాండ్ల ప్రచారంపై దృష్టి పెట్టాలని గోయెల్ కోరారు.
ఈయూతో వాణిజ్య ఒప్పందం: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కోసం యూరోపియన్ యూనియన్ దేశాలతో జరుగుతున్న చర్చలు ఏడాది లేదా ఏడాదిన్నరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని గోయెల్ తెలిపారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత-ఈయూ వాణిజ్యం ఆటుపోట్లు లేకుండా స్థిరంగా వృద్ధి సాధిస్తుందన్నారు. బ్రిటన్, యూఏఈలతో కుదుర్చుకున్న తరహాలోనే ఇతర దేశాలతోనూ ఎఫ్టీఏలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. భారత్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు స్విట్జర్లాండ్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకూ సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి:
రెస్టారెంట్లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..