ఆర్థిక నారీమణులు
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:46 AM
దేశ ఆర్థిక రంగంలో అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయక మహిళల వివరాలతో కాడెరే, హురున్ ఇండియా సంయుక్తంగా ఓ జాబితాను విడుదల చేశాయి...
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంలో అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయక మహిళల వివరాలతో కాడెరే, హురున్ ఇండియా సంయుక్తంగా ఓ జాబితాను విడుదల చేశాయి. ఈ తరహా లిస్ట్ను రూపొందించడం ఇదే తొలిసారి. కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న నారీమణుల విభాగంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ ఎండీ శాంతి ఏకాంబరం అగ్రస్థానంలో నిలిచారు. 62 ఏళ్ల శాంతి ఏకాంబరం.. రూ.3.82 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కోటక్ బ్యాంక్ కీలక సారథుల్లో ఒకరుగా ఉన్నారు. ఇక తొలి తరం సంపద సృష్టికర్తల విషయానికొస్తే, జోహో సహ వ్యవస్థాపకురాలు రాధ వెంబు రూ.55,300 కోట్ల నెట్వర్త్తో నం.1గా ఉన్నారు. తొలి తరం సంపద సృష్టికర్తల విభాగంలోని టాప్ -10 నారీమణుల మొత్తం ఆస్తి రూ.2 లక్షల కోట్ల పైమాటే. వారి సారథ్యంలో నడుస్తున్న కంపెనీల మార్కెట్ విలువ రూ.12 లక్షల కోట్లపైనే. రెండో తరం మహిళా సారథుల విభాగంలో రూ.4.87 లక్షల కోట్ల విలువైన హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి నలుగురు కూతుళ్లు ప్రీతా, శోభన, సునీత, సంగీతా రెడ్డి కూడా నెక్ట్స్ జెనరేషన్ లీడర్ల విభాగం
టాప్-10లో చోటు దక్కించు కున్నారు. రూ.97,600 కోట్ల మార్కెట్ విలువ కలిగిన అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్ నిర్వహణలో ఈ నలుగురూ కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా ఇన్వెస్టర్లలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ శ్వేత జలాన్, దాతృత్వంలో రోహిని నీలే కని, అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ అగ్రగామిగా నిలిచారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి