వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల స్మార్ట్ ఏసీల విక్రయం
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:03 AM
బ్లూస్టార్ లిమిటెడ్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 5 లక్షల స్మార్ట్ ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది....
మార్కెట్లోకి 150 కొత్త మోడళ్ల విడుదల
బ్లూస్టార్ ఇండియా ఎండీ త్యాగరాజన్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బ్లూస్టార్ లిమిటెడ్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 5 లక్షల స్మార్ట్ ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఏసీలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి సరికొత్త ఎయిర్ కండీషనర్స్ (ఏసీ)ను తీసుకువస్తున్నట్లు బ్లూస్టార్ ఎండీ బీ త్యాగరాజన్ వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ మార్కెట్లోకి 150 కొత్త రూమ్ ఏసీ మోడళ్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఏసీల విక్రయాలు లక్ష యూనిట్ల వరకు ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఏసీల విక్రయాలు 15 లక్షల యూనిట్లుగా ఉంటాయని భావిస్తున్నామన్నారు. అయితే 2025-26లో విక్రయాలు 20 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు.
2028 నాటికి శ్రీసిటీ రెండో యూనిట్ రెడీ: కాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో 40 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న రెండో ఏసీ తయారీ యూనిట్ 2028 నాటికల్లా అందుబాటులో వస్తుందని త్యాగరాజన్ చెప్పారు. కాగా బ్లూస్టార్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో 15 శాతం వాటా ఉందని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..