Share News

ఆర్‌బీఐ పసిడితంత్ర!

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:52 AM

సగటు భారతీయులకే కాదు.. మన దేశ సెంట్రల్‌ బ్యాంకైన భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కూ పసిడిపై మక్కువే. ఈ మధ్య కాలంలో ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. గత అక్టోబరు, నవంబరులో...

ఆర్‌బీఐ పసిడితంత్ర!

భారీగా బంగారం పోగేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌

ముంబై: సగటు భారతీయులకే కాదు.. మన దేశ సెంట్రల్‌ బ్యాంకైన భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కూ పసిడిపై మక్కువే. ఈ మధ్య కాలంలో ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. గత అక్టోబరు, నవంబరులో మరో 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మొదటి 8 నెలల్లో (ఏప్రిల్‌-నవంబరు) ఆర్‌బీఐ 50 టన్నుల బంగారం పోగేసింది. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ వద్దనున్న మొత్తం బంగారం నిల్వలు 876.18 టన్నులకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పసిడి ధరలు 19 శాతం మేర పెరిగినప్పటికీ, అక్టోబరు-నవంబరు కాలంలో కాస్త నిలకడగానే కొనసాగాయి. దాంతో ఆర్‌బీఐ కొనుగోళ్లను పెంచింది.


విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వల వివిధీకరణ వ్యూహం లో భాగంగానే ఆర్‌బీఐ పసిడి నిల్వలను పెంచుకుంటోంది. ఎందుకంటే, విదేశీ కరెన్సీలు ప్రధానంగా డాలర్‌ విలువలో హెచ్చుతగ్గులు మన ఫారెక్స్‌ నిల్వలపై చూపే ప్రభావాన్ని తగ్గించుకునేందుకు బంగారం నిల్వలు దోహదపడనున్నాయి. గత నెల 27తో ముగిసిన వారంలో భారత్‌ వద్ద విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వలు 411 కోట్ల డాలర్ల మేర తగ్గి 64,027 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ నిల్వలు 847 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. 2024 సెప్టెంబరు చివర్లో ఆల్‌టైం రికార్డు స్థాయి 70,488 కోట్ల డాలర్లకు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు.. గత కొన్ని వారాలుగా నిల్వలు క్షీణిస్తూ వస్తున్నాయి.

Updated Date - Jan 05 , 2025 | 05:52 AM