Share News

మేడిన్‌ ఇండియా కు చైనా కంపెనీలు జై

ABN , Publish Date - Jun 16 , 2025 | 01:40 AM

పరిస్థితులకు తగ్గట్టు మారితేనే వ్యాపారంలో మనుగడ. చైనా కంపెనీలు ఈ విషయాన్ని బాగానే వంట పట్టించుకున్నాయి. ఇప్పటి వరకు భారత మార్కెట్‌పైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీలు...

మేడిన్‌ ఇండియా కు చైనా కంపెనీలు జై

అమెరికా,పశ్చిమాసియాలే లక్ష్యంగా భారత్‌ నుంచి ఎగుమతులు

న్యూఢిల్లీ: పరిస్థితులకు తగ్గట్టు మారితేనే వ్యాపారంలో మనుగడ. చైనా కంపెనీలు ఈ విషయాన్ని బాగానే వంట పట్టించుకున్నాయి. ఇప్పటి వరకు భారత మార్కెట్‌పైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీలు ఇప్పుడు ఎగుమతులకూ భారత్‌ను కేంద్రంగా మార్చుకుంటున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), అమెరికా దేశాల్లో తమకు ఎదురవుతున్న ఆంక్షలను తప్పించుకునేందుకు ‘భారత్‌లో తయారీ’ (మేడిన్‌ ఇండియా)కి జై కొడుతున్నాయి. చైనా స్మార్ట్‌ఫోన్‌, ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల కంపెనీలు ఈ విషయంలో ముందున్నాయి. ఇందుకోసం స్థానిక కంపెనీలతో తయారీ ఒప్పందాలు కుదుర్చుకుని మరీ తమ వస్తువులను అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) వద్ద అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2023-24లో భారత్‌ నుంచి ఒప్పో మొబైల్స్‌ ఇండియా రూ.272 కోట్లు, రియల్‌మీ మొబైల్‌ టెలికమ్యూనికేషన్స్‌ (ఇండియా) రూ.114 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు మన దేశం నుంచి ఎగుమతి చేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాల వివరాలను ఈ కంపెనీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.


ఎందుకంటే?

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టక ముందు నుంచే అమెరికా, చైనా దిగుమతులపై ఆంక్షలు కఠినం చేసింది. ఈయూలోనూ ఇదే పరిస్థితి. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక అమెరికా చైనాపై మరింత రెచ్చిపోతోంది. చైనా ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకం విధించారు. రేర్‌ ఎర్త్‌ ఖనిజ ఉత్పత్తుల కోసం ఈ సుంకాల పోటు కొద్దిగా తగ్గించినా.. చైనా వస్తువుల దిగుమతులు ఇంకా 55 శాతం సుంకాల పరిధిలో ఉన్నాయి. భారత్‌పై ఉన్న 26 శాతంతో పోలిస్తే ఇది 29 శాతం ఎక్కువ. భారత -అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కుదిరితే ఈ పోటు కూడా ఉండదు. భారత-బ్రిటన్‌ మధ్య ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కూడా చైనా కంపెనీలను ఆకర్షిస్తోంది. దీంతో అమెరికా, ఈయూ మార్కెట్లలో ప్రవేశించేందుకు భారత్‌లో తయారీకి చైనా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

ప్రభుత్వ ఆంక్షలు: అయితే 2020 గాల్వన్‌ సరిహద్దు ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీల పెట్టుబడులను కట్టడి చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ దేశీయ కంపెనీలోనూ చైనా కంపెనీల పెట్టుబడులను అనుమతించడం లేదు. అయితే స్థానిక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తమ ఉత్పత్తులను ఆ కంపెనీల్లో తయారు చేయించి ఎగుమతి చేసుకోవచ్చని పరోక్షంగా సూచించింది. అయితే ఇందుకోసం ఆ కంపెనీలకు పూర్తి స్థాయిలో టెక్నాలజీ బదిలీ చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఇందుకు ససేమిరా అన్న చైనా కంపెనీలు.. ఇప్పుడు అందుకు రెడీ అంటూ ముందుకొస్తున్నాయి.


దారికొచ్చిన చైనా కంపెనీలు

  • పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు హైసెన్స్‌ గ్రూప్‌ ఎగుమతి చేసే టీవీలు, గృహోపకరణాల తయారీ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో రూ.100 కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ఇప్యాక్‌ డ్యూరబుల్స్‌ కంపెనీ

  • డిక్సన్‌ టెక్నాలజీ్‌సలో తయారైన తన అనుబంధ కంపెనీ మోటరోలా స్మార్ట్‌ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేస్తున్న లెనోవా. త్వరలో సర్వర్లు, లాప్‌టా్‌పల ఎగుమతికి సన్నాహాలు

  • ఆఫ్రికా దేశాలకు ఎగుమతి కోసం చైనా కంపెనీ ట్రాన్సిషన్‌ హోల్డింగ్స్‌ ఐటెల్‌, టెక్నో, ఇన్ఫినిక్స్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న డిక్సన్‌ టెక్నాలజీస్‌

  • భారత్‌ నుంచి కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ పరికరాలు, గృహోపకరణాలు ఎగుమతి చేసే విషయాన్ని పరిశీలిస్తున్న హాయర్‌ కంపెనీ

  • ఎగమతుల బాట పట్టిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ఒప్పో, వివో, వన్‌ప్ల్‌స, షామీ

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 01:40 AM