Paper Industry: రూ.178 కోట్లతో రాజమండ్రి ప్లాంట్ విస్తరణ
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:29 AM
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్లాంట్ అప్గ్రేడేషన్, పేపర్ మెషిన్ 3 పునర్ నిర్మాణం కోసం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్లాంట్ అప్గ్రేడేషన్, పేపర్ మెషిన్-3 పునర్ నిర్మాణం కోసం రూ.178 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ప్రకటించింది. ప్రతిపాదిత పెట్టుబడులకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం లభించిందని తెలిపింది. ఈ పెట్టుబడులను అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల రూపంలో సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 36,000 టన్నులుగా ఉండగా ప్రతిపాదిత విస్తరణతో ఉత్పత్తి సామర్థ్యం 60 శాతం మేర పెరగనుందని పేర్కొంది. వచ్చే 13 నెలల కాలంలో ఈ విస్తరణను పూర్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.420.64 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.21.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.