YSRCP to Hold Rallies: మెడికల్ కాలేజీలపై నేడు వైసీపీ ర్యాలీలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:44 AM
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ బుధవారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలను చేపట్టనుంది....
విజయవంతం చేయాలంటూ నేతలను కోరిన సజ్జల
తిరుపతి లడ్డూపై ఆధారాల్లేకుండా ఆరోపణలంటూ ధ్వజం
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ బుధవారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలను చేపట్టనుంది. ఈ నెల ఏడో తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత, ఈ నిరసనను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. శాసనసభా నియోజకవర్గాల వారీగా చేపట్టే ఈ ర్యాలీలను విజయవంతం చేయాలని లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. తిరుమల లడ్డూపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. లడ్డూలో రసాయనాలు కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో ఆవునెయ్యి కల్తీ అయ్యిందని విమర్శించారని.. ఇప్పుడు రసాయనాలు కలిశాయంటూ ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు.