అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ అజెండా
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:38 AM
యలమంచిలి మండల పరిషత్ సమావేశంలో గురువారం ప్రతిష్టంభన నెలకొంది.
యలమంచిలి మండల పరిషత్ సమావేశంలో ప్రతిష్టంభన
కూటమి సభ్యులు హాజరు.. ఎంపీపీ చాంబర్లో వైసీపీ సభ్యులు
కోరం లేదని సమావేశం వాయిదా వేసిన ఇన్చార్జి ఎంపీడీవో
యలమంచిలి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): యలమంచిలి మండల పరిషత్ సమావేశంలో గురువారం ప్రతిష్టంభన నెలకొంది. సమావేశానికి కూటమి పక్ష సభ్యులు వచ్చినా వైసీపీకి చెందిన ఎంపీపీ, సభ్యులు చాంబర్లోనే ఉండి సమావేశం హాలుకు రాలేదు. చివరకు కోరం లేదంటూ ఇన్చార్జి ఎంపీడీవో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ఎజెండా అంటూ కూటమి పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
మండల పరిషత్ సమావేశానికి మధ్యాహ్నం 2గంటలకు కూటమి పక్ష ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు చేరుకున్నారు. కానీ వైసీపీకి చెందిన ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి, పలువురు ఎంపీటీసీ సభ్యులు సమావేశ హాలుకు వెళ్లకుండా ఎంపీపీ ఛాంబర్లోనే ఉన్నారు. సుమారు 4 గంటల సమయంలో ఇన్చార్జి ఎంపీడీవో జేడీవీ.ప్రసాద్ కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీనితో కూటమి పక్ష ఎంపీటీసీ సభ్యులు చిలుకూరి రాజ్యలక్ష్మి, కవురు నాగలక్ష్మి, జిల్లెళ్ల రత్నం రాజు, డేగల సత్యసూర్యప్రభ, సర్పంచులు ఈద ప్రమీల, తాళ్ల నాగరా జు, బుడితి జయరాజు, అడబాల చిట్టిబాబు నిరసన తెలిపారు. తమను రెండు గంటలపాటూ కూర్చోబెట్టారని.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా అవమానించారన్నారు. సమావేశం జరగకూడదని వైసీపీకి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు ఛాంబర్లో కూర్చున్నాన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ అజెండా అని విమర్శించారు.
అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు
అనంతరం ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ తాను ఎంపీపీగా ఎన్నికైన తర్వాత సుమారు 6 గ్రామాల్లో పలు అభి వృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు జరిగాయని, తనకు కనీస సమాచారం ఇవ్వలేదని, ప్రొటోకాల్ను పాటించకపోవడం దారుణమన్నారు. ఇన్చార్జి ఎంపీపీ అభివృద్ధి పనులకు రూ.78లక్షలు నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారని.. వాటిని గాలికొదిలేశారన్నారు. ప్రొటోకాల్, నిధుల కేటాయింపు తీర్మానాలపై ఎంపీడీవోను అడిగేందుకు వచ్చామని, సమాచారం లేకుం డా ఎంపీడీవో సెలవు పెట్టారన్నారు. ఇన్చార్జి ఎంపీడీవో సమావేశం మాత్రమే నిర్వహిస్తానని చెప్పడంతో తాము హాజరు కాలేదన్నారు. వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, వైసీపీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.