మహిళా సాధికారిత ధ్యేయం
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:34 AM
మహిళా సాధికారిత ధ్యేయంగా ప్రభుత్వం, తాము పనిచేస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు.
ఏలూరు జిల్లాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ
దెందులూరులో బాలికలతో మాట్లాడుతున్న రాయపాటి శైలజ
ఏలూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారిత ధ్యేయంగా ప్రభుత్వం, తాము పనిచేస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఏలూరు జిల్లాలో గురువారం ఆమె విస్తృ తంగా పర్యటించారు. హనుమాన్ జంక్షన్లో శక్తిసదన్, ముసునూరు గురుకుల పాఠశాల సందర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వన్స్టాప్ సెంటర్లో మహిళ లకు అందుతున్న సేవలను పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్లో నమోదవుతున్న కేసులు, వైద్య సదుపాయం పై ఆరా తీశారు. టీటీడీ కల్యాణమండపం వద్ద ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను సందర్శించారు. యువతులు ఎక్కువగా మో సపూరిత మాటలు, సోషల్ మీడియాకు ప్రభావితులై సమస్యలు ఎదుర్కొంటున్నారని శైలజ అన్నారు. గృహహింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, వరకట్న వేధింపులు, సైబర్ నేరాలు, కిడ్నాప్, బాల్య వివాహాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట మహిళా, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ సుజాతరాణి, నోడల్ అధికారి స్వరాజ్యలక్ష్మి, సీడీపీవో రాజశేఖర్, ఈవో మల్లిక, సెంట్ర ల్ అడ్మినిస్ర్టేటర్ నిర్మల, మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎం.సుబ్బారావు, తహసీల్దార్ గాయత్రి ఉన్నారు.
మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కల్పిండమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాయపాటి శైలజ అన్నారు. ముసునూరు గురుకుల బాలికల పాఠశాలలో ఉపా ధ్యాయుల పనితీరు, బోధన, భోజనం, రక్షణ, సమస్యలు తదితర విషయాలపై బాలికలతో మాట్లాడారు. అనంత రం భోజనశాలను, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీ లించి చైర్పర్సన్ బాలికలకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్, సీడీపీవో పి.విజయకుమారి పాల్గొన్నారు.
బాలికల హక్కులు తెలుసుకోవాలి
దెందులూరు: బాలికలు హక్కులను తెలుసుకోవా లని, పట్టుదల ప్రణాళికతో కష్టపడి చదివితే బాల సదనం నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని శైలజ అన్నారు. దెందులూరులోని ప్రభుత్వ బాలికల వసతి గృహం (బాలసదనం) పరిశీలించి సూపరింటెండెంట్ బేబి సరోజిని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి వారి డ్యాన్స్లను చూసి మెచ్చుకున్నారు. సీడీపీవో సునీల్ రాజశేఖర్, తహసీల్దార్ బత్తుల సుమతి ఉన్నారు.
అనంతరం దెందులూరులో రోజుకు 10 వేల మందికి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాలు అందిస్తున్న అక్షయ పాత్రను శైలజ పరిశీలించారు.