బియ్యం సిండికేట్ బద్దలైంది!
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:47 AM
సన్నబియ్యం వ్యాపారుల సిండికేట్ బద్దలైంది.
రైస్మిల్లుల వద్ద పేరుకుపోయిన నిల్వలు
ఇతర జిల్లాల నుంచి దిగుమతులు
వ్యాపారుల మధ్య పోటీ ధరలు తగ్గించి విక్రయాలు
మార్కెట్లో సన్న బియ్యం క్వింటాలుకు రూ.600 తగ్గుదల
వినియోగదారులకు ఊరట
సన్నబియ్యం వ్యాపారుల సిండికేట్ బద్దలైంది. విదేశాలకు ఎగుమతి పేరుతో వ్యాపారులు ధరలు పెంచేశారు. రైస్ మిల్లుల వద్ద నిల్వలు పేరుకుపోవడంతో వ్యాపారులు దిగొచ్చారు. ధరలు ఒక్కసారిగా తగ్గించారు. తూర్పు గోదావరి, కృష్ణా, కర్ణాటక ప్రాంతాల నుంచి సన్నబియ్యం దిగుమతి చేసే వ్యాపారులు పశ్చిమపై ఆధారపడుతున్నారు. జిల్లాలోని హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాల్లో సైతం అమ్మకాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రైస్ మిల్లుల వద్ద బియ్యం నిల్వలు పేరుకు పోవడం, ఇతర జిల్లాల నుంచి దిగుమతులతో వ్యాపారుల సిండికేట్ బద్దలైంది. ధరలను తగ్గించి హోల్సేల్ వ్యాపారులతో పాటు రిటైల్ మార్కెట్లో విక్రయాలకు తంటాలు పడుతు న్నారు. గతంలో 26 కిలోల బియ్యం ప్యాకెట్ రూ.1600 ధర ఉండగా ప్రస్తుతం మార్కెట్లో రూ.1450 ధరకు లభిస్తోంది. రూ.1450 పలికే బ్రాండెడ్ రకాలు రూ.1300 ధరకు తగ్గిపోయా యి. క్వింటాల్కు రూ.600 ధర తగ్గింది. వినియో గదారులకు కాస్త ఊరట లభించింది.
కొద్దిమంది చేతుల్లో సన్న బియ్యం
సన్నబియ్యం వ్యాపారం కొద్దిమంది మిల్లర్ల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 40మంది మిల్లర్లు సన్నబియ్యాన్ని విక్రయిస్తు న్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. వా రంతా సిండికేట్గా ధరలను పెంచేశారు. ఒక ప్పుడు రూ.1100 ధరకు విక్రయించే బియ్యాన్ని క్రమంగా రూ.1500 వరకు తీసుకువెళ్లారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయా యి. తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా పశ్చిమకు సన్నబియ్యాన్ని దిగుమతి చేస్తుంటారు. జిల్లాలో మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్తో ప్రభుత్వానికి బియ్యాన్ని అప్పగిస్తు న్నారు. కస్టమ్ మిల్లింగ్ చేసేవారు ప్రైవేటు ధాన్యం కొనుగోలు చేయకూడదన్న నిబంధనతో జిల్లాలో మిల్లర్లు ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యంపైనే ఆధారపడుతున్నారు. గతంలో విదేశీ మార్కెట్కు మిల్లర్లు పోటీపడి ఎగుమతిదారుల కు బియ్యాన్ని అప్పగించేవారు. బియ్యం ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఎగుమతి చేయడానికి క్వింటాల్కు రూ.200 నష్టపోతున్నారు. దాంతో ప్రైవేటు వ్యాపారాలను విరమించుకున్నారు.
సన్న బియ్యానికి డిమాండ్
సన్న బియ్యం వినియోగానికి జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతారు. రేషన్ బియ్యాన్ని తిరిగి మార్కెట్కు విక్రయించేస్తున్నారు. అవి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి. ఇటీవల అక్రమ ఎగుమ తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టోంది. రేషన్ బియ్యాన్ని విక్రయించిన లబ్ధిదా రులు సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటు న్నారు. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు సిండికేట్గా ధరలు పెంచేశారు. జీఎస్టీ, ఎగుమతుల నెపంతో ధరలు పెంచి విక్రయిం చేవారు. అధికార యంత్రాంగం కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ధాన్యం పేరుకుపోవ డంతో ధరలు దిగి వచ్చాయి. హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దకు తిరిగి అమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.