Share News

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు లేరు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:21 AM

గ్రామ, వార్డు సచివాలయాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సగం మంది కూడా ఇంజనీర్లు లేకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది.

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు లేరు

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిభారం

604 సచివాలయాల్లో 342 మంది ఇంజనీర్లు

ఒక్కొక్కరికి నాలుగు చోట్ల బాధ్యతలు

పోస్టులు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులు

ఏలూరు రూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సగం మంది కూడా ఇంజనీర్లు లేకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. మొత్తం 604 గ్రామ సచివాలయాల్లో 342 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. పోస్టు లు భర్తీ చేయకపోవడంతో ఉన్న వారిపైనే పనిభారం పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కొక్క ఇంజ నీరింగ్‌ అసిస్టెంట్‌లకు నాలుగేసి గ్రామ సచివాలయాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఇప్పటికీ ఇంజనీరింగ్‌ పోస్టులు భర్తీ కాలేదు. దీనితో గ్రామాల్లో జరిగే పంచాయతీరాజ్‌ పనులపై ప్రభావం పడుతోంది. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ, ఎంబుక్‌ రికార్డు నమోదు, అంచనాల తయారీ తదితర పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. నాలుగేసి సచివాలయాల్లో పనులు చూడడం తలకు మించిన భారంగా ఉందని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు. బదిలీలు చేపడితే సమస్య మరింత తీవ్రమవుతుందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెం ట్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:21 AM