సుందర గిరిపై ముగిసిన పవిత్రోత్సవాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:38 AM
సుందరగిరిపై కొలువు దీరిన శ్రీలక్ష్మీనారసింహుని ఆలయంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన దివ్యపవిత్రోత్సవాలు గురువారం జరిగిన విశేష కార్యక్రమాల తో ముగిశాయి.
ద్వారకాతిరుమల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): సుందరగిరిపై కొలువు దీరిన శ్రీలక్ష్మీనారసింహుని ఆలయంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన దివ్యపవిత్రోత్సవాలు గురువారం జరిగిన విశేష కార్యక్రమాల తో ముగిశాయి. స్మార్త ఆగమాన్ని అనుసరించి ఈనెల 19 నుండి మూడురోజులు పాటు తొలిసారి దివ్యపవిత్రోత్సవాలు నిర్వహించేం దుకు దేవస్దానం శ్రీకారం చుట్టిన విషయం విదితమే... ఏడాదిలో ఆలయంలో తెలిసి తెలియక దొర్లిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ ఉత్సవాలను జరుపుతారు. ఈక్రమంలో గురువారం ఆలయ యాగశాలలో మహాశాంతి హోమం, పౌష్టిక హోమం, శ్రీమహాపూర్ణాహుతి హోమం, పవిత్రవిసర్జన, శాంతికల్యాణంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. ఆలయ ఈవో ఎన్వీ.సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. లక్ష్మీపురం ఆలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న దివ్య పవిత్రోత్సవాలు గురువారం జరిగిన శ్రీమహాపూర్ణాహుతి హోమంతో ముగిశాయి.
నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
చిన వెంకన్న క్షేత్రంలోని అనివేటి మండపం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను పెద్ద ఎత్తున జరిపేందుకు దేవస్థానం చేసిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శ్రావణమాసంలో ఆఖరి శుక్ర వారాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీవ్రత నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే వేదికను నిర్మించారు. హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా అరటి బోదెలు, మామిడి తోరణాలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు. అధికసంఖ్యలో ముతైదువులు హాజరుకావచ్చని ఆధికారులు అంచనా వేస్తున్నారు. వారికి దే వస్థానం కొంత మేర పూజా సామగ్రి అందజేస్తుందని అధికారులు చెబుతున్నారు. వందల సంఖ్యలో మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.