యూరియా కోసం క్యూ
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:45 AM
కుక్కునూరు రైతు భరోసా కేంద్రానికి బుధ వారం 300 బస్తాల యూరియా రావడంతో 150 మందికి పైగా రైతులు తరలి వచ్చారు.
కుక్కునూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కుక్కునూరు రైతు భరోసా కేంద్రానికి బుధ వారం 300 బస్తాల యూరియా రావడంతో 150 మందికి పైగా రైతులు తరలి వచ్చారు. ఒక్క ఆధార్ కార్డుపై ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తానమడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో వ్యవ సాయాధికారి బాలాజీ రైతులకు యూరియా పంపిణీ చేశారు.
పోలీసుల సహకారంతో..
చింతలపూడి : యూరియా పక్కదారులు పట్టకుండా అమ్మకాలపై పోలీసు ల సహకారంతో వ్యవసాయాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. స్థానిక డీసీ ఎంఎస్కు బుధవారం వెళ్లి రికార్డులు తనిఖీ జరిపారు. వ్యవసాయాధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ డీసీఎంఎస్కు 18 టన్నుల యూరియా వచ్చింద న్నారు. వ్యవసాయాధికారి వై.సుబ్బారావు, ఎస్ఐ సతీష్కుమార్ పాల్గొన్నారు.
అసత్యప్రచారాలు నమ్మొద్దు : జడ్పీ చైర్పర్సన్
ఏలూరు సిటీ : జిల్లాలో రైతులకు యూరియా సరఫరా జరగడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఖరీఫ్ సీజన్ (2024–25)లో నవంబరు వరకు జిల్లాలో రైతులు వాడిన యూరియా మొత్తం 31 వేలు మెట్రిక్ టన్నులు కాగా ఈ ఏడాదీ అదే స్థాయిలో యూరి యా వినియోగం ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2025–26లో ఇప్పటివరకు 28 వేలు మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశారన్నారు.
ఎరువుల కొరత లేకుండా చర్యలు : కలెక్టర్
జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వ, అక్రమ తరలింపులపై ప్రత్యేక నిఘా పెట్టి పారదర్శకంగా సరఫరాకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై సెక్రటరియేట్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎరువుల సరఫరా వివరాలను కలెక్టర్ వివరించారు.
‘యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం’
ఏలూరు రూరల్ : రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ ధ్వజమెత్తారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యూరియా కొరత, రైతాంగ సమస్యలపై 9న ఏలూరు ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.