బదిలీల వేళ పదోన్నతులా?
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:30 AM
సాధారణ బదిలీల ప్రక్రియ జరుగుతుండగా జిల్లా వైద్యఆరోగ్యశాఖలో హఠాత్తుగా పదోన్నతుల కౌన్సెలింగ్కు తెరతీయడం పలు సందేహాలకు, వివాదానికి దారితీస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖలో కలకలం
అడ్డుకునేందుకు ఉద్యోగుల యత్నం
ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాలకే పరిమితమైనవారికి అన్యాయం
ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధం
అధికారుల అనుమతి ఉంది : డీఎంహెచ్వో
సాధారణ బదిలీల ప్రక్రియ జరుగుతుండగా జిల్లా వైద్యఆరోగ్యశాఖలో హఠాత్తుగా పదోన్నతుల కౌన్సెలింగ్కు తెరతీయడం పలు సందేహాలకు, వివాదానికి దారితీస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో గ్రేడ్–3 ఏఎన్ఎంలకు ఎంపీహెచ్ఏ (ఫిమేల్)గా పదోన్నతులు కల్పించడానికి బుధవారం ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయంలో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. బదిలీల ప్రక్రియను నీరుగార్చేలా ఆయా బదిలీ స్థానాలను ఆశించే సీనియర్ రెగ్యులర్ ఏఎన్ఎంలకు నష్టం కలిగేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖవర్గాలు వ్యవహరిస్తున్నాయని వైద్య ఉద్యోగులు మండి పడుతున్నారు.
ఏలూరు అర్బన్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీల వేళ ముందుగానే పదోన్నతులను ఇవ్వడంవల్ల ఏళ్లతరబడి పనిచేస్తున్నవారంతా మారుమూల ప్రాంతా లకే పరిమితమవుతారని, దీనివల్ల తమకు అన్యాయమే జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పదోన్నతి కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేయడంతో అడ్డుకునేందుకు పలువురు ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వైద్య ఆరోగ్యశాఖలో అన్ని కేడర్ల ఉద్యోగులకు బదిలీలను రెండు వారాల్లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం మార ్గదర్శకాలను విడుదల చేసింది. బదిలీలకు ముందే పదో న్నతులు ఇవ్వాలని ఎక్కడా నిర్దేశించలేదని వైద్య ఉద్యోగులు చెబుతున్నారు. ముందుగానే పదోన్నతులిస్తే అందుబాటులోవున్న మంచిస్థానాలను తాము కోల్పోతా మని ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికారు లను అభ్యర్థించినా అరణ్యరోదనే అవుతోందని వాపోతు న్నారు. పంచాయితీరాజ్శాఖలో నియమితులై ఇపుడు ఎంపీహెచ్ఏ (ఫిమేల్) పదోన్నతితో వైద్య ఆరోగ్య శాఖలోకి రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రవేశిస్తున్న ఏఎన్ ఎంలపై తమకు అగౌరవం లేదని, దశాబ్దాల తరబడి రెగ్యులర్ ఏఎన్ఎంలుగా మారుమూల ప్రాంతాల్లో రీడిప్లాయ్మెంట్ (వర్క్ అడ్జస్ట్మెంట్) కింద పని చేస్తున్నవారికి తొలుత బదిలీలు కల్పించాలన అడుగుతు న్నామని చెబుతున్నారు. ఏలూరు డీఎంహెచ్వో కార్యాల యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన పదోన్నతి కౌన్సెలింగ్ను అడ్డుకునేందుకు కొందరు వైద్యఉద్యోగులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కౌన్సెలింగ్ సాఫీగా జరిగేందుకువీలుగా పోలీసు భద్రతను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
256 మందికి పదోన్నతి : డీఎంహెచ్వో
పదోన్నతుల కౌన్సెలింగ్కు నిర్వహణకు రాష్ట్ర అధికారు లు అనుమతించారని జిల్లా వైద్యాధికారి మాలిని వివరణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 256 మంది గ్రేడ్–3 ఏఎన్ఎంలకు ఎంపీహెచ్ఏ(ఫిమేల్) ఉద్యోగులు గా పదోన్నతి కల్పిస్తున్నాం. పదోన్నతులతో వారంతా వైద్య ఆరోగ్యశాఖ పరిదిలోకి వస్తారు. ఇది పూర్తయిన తర్వాత కేడర్ల వారీగా బదిలీలు చేపడతాం. జిల్లాలో వైద్య ఉద్యోగుల బదిలీలు భారీగానే ఉంటాయి.