స్వల్ప పెనాల్టీతో గట్టెక్కారు!
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:28 AM
ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలానికి సంబంధించి పొగాకు బోర్డు అనుమతి మేరకు రైతులు పండించిన పొగాకు అమ్మకాలు దాదాపు 95 శాతం వరకు పూర్తయ్యాయి.
స్వల్ప పెనాల్టీ విధింపుతో కొనుగోళ్లకు ఆమోదం
ఇప్పటికే 95 శాతం పూర్తయిన పొగాకు అమ్మకాలు
రేపటి నుంచి అదనపు పొగాకు కొనుగోళ్లు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.. ఎంపీ పుట్టా మహేశ్కు కృతజ్ఞతలు
ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలానికి సంబంధించి పొగాకు బోర్డు అనుమతి మేరకు రైతులు పండించిన పొగాకు అమ్మకాలు దాదాపు 95 శాతం వరకు పూర్తయ్యాయి. అయితే రైతులు అదనంగా పండించిన సుమారు 20 మిలియన్ కిలోలకు పైగా ఉన్న పొగాకుపై స్వల్ప అపరాధ రుసుము విధించి తమ పొగాకును ఆయా వేలం కేంద్రాల ద్వారా అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ నుంచి గెజిట్ పబ్లికేషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడంపై రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
జంగారెడ్డిగూడెం,సెప్టెంబరు 7(ఆంధ్ర జ్యోతి): కరోనా కారణంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో గతే డాది ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ చొరవ తో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ సహకారంతో రైతులు అదనంగా పండించిన పొగాకుపై అపరాధ రుసుం లేకుండా తమ పొగాకును బోర్డు ద్వారా అమ్ముకున్నారు. అదనంగా పండించిన సుమారు ఆరు మిలియన్ కిలోల పొగా కుకు ఎటువంటి అపరాధ రుసుము లేకుం డా అమ్ముకోవడం వల్ల ఎన్ఎల్ఎస్ పరిధిలో ఉన్న దేవరపల్లి,గోపాలపురం, కొయ్యల గూ డెం, జంగారెడ్డిగూడెంలో రెండు వేలం కేంద్రాల పరిధిలో ఉన్న రైతులు సుమారు రూ.10 నుంచి 20 కోట్ల వరకు లాభ పడ్డా రు. ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా రావడంతో 20 మిలియన్ కిలోలకు పైగా పొగాకు అదనంగా పండింది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా కేంద్ర ప్రభు త్వం సహకరిస్తే బావుంటుందని రైతులు ఎంపీను కోరారు. దీంతో ఎంపీ మహేశ్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో పలుసార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్వల్ప అపరాధ రుసుముతో రైతులకు ఊరట కలిగించారు. గతంలో అదనంగా పండించిన పొగాకుకు రైతుల నుంచి నూటికి ఇరవై ఐదు శాతం అపరాధ రుసుము వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని రైతు సంఘ నాయకుడు పొన్నగంటి అనిల్ తెలిపారు.
పెనాల్టీ,సర్వీసు చార్జీల వివరాలు
ఒక బ్యారన్కు 41 క్వింటాళ్లు పొగాకు పండించడానికి బోర్డు అనుమతినిస్తుంది. బోర్డు ఇచ్చిన అనుమతి కంటే అదనంగా పదిశాతం వరకు పొగాకు పండించిన రైతుకు ఎటువంటి పెనాల్టీలు లేవు. రైతు అమ్మకాల విలువపై ఒక శాతం సర్వీసు చార్జీని పొగాకు నిధికి చెల్లించాల్సి ఉంటుంది.
బ్యారన్ కోటాలో పది నుంచి ఇరవై శాతం వరకు కిలోకు రూ.1 చొప్పున పెనాల్టీ, అమ్మకాల విలువపై 2 శాతం, సాధారణ సర్వీసు చార్జీ ఒకశాతం మొత్తం 3 శాతం సర్వీసు చార్జీలు వసూలు చేస్తారు. 20 శాతం కంటే ఎక్కువగా ఉన్న పొగాకుకు కిలో పొగాకుకు రూ.1 పెనాల్టీతో పాటు, అమ్మకాల విలువపై 3 శాతం, సాధారణ సర్వీసు చార్జీ ఒక శాతం మొత్తం 4శాతం వసూలు చేస్తారు.
రైతులందరికీ ఎంతో మేలు
గత మూడేళ్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల పొగాకు పంట బాగా తక్కువ పండింది. ఈ ఏడాది ప్రకృతి సహకరించడం వల్ల బాగా పండింది. అదనంగా పండిన పొగాకుపై కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ పెనాల్టీతో అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. రైతులందరికీ ఎంతో సహాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పొన్నగంటి అనిల్, పొగాకు రైతు,చల్లావారిగూడెం
ఎంపీ సహకారం మరువలేనిది
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ సహకారం మరువ లేనిది పొగాకు, పామాయిల్ రైతులకు ఎంపీ ఎంతో సహకరిస్తున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడి గతేడాది లాగానే ఈ ఏడాదీ అదనపు పొగాకును అతి తక్కువ పెనాల్టీతో అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో ఉన్న పదిహేను వేల మంది పొగాకు రైతులు ఎంపీకి రుణపడి ఉంటాము.
– పరిమి రాంబాబు, రైతు సంఘం అధ్యక్షుడు, వేలం కేంద్రం – 18, జంగారెడ్డిగూడెం