సర్ప్లస్ టీచర్లలో ‘బదిలీ’ ఆందోళన
ABN , Publish Date - May 25 , 2025 | 11:51 PM
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తరగతిలో విద్యార్థుల సంఖ్య 49 దాటితే రెండో సెక్షన్ను మంజూరు చేయడంతోపాటు, ఆ మేరకు ఇప్పటికే జరిగిన సర్ప్లస్ పోస్టుల సర్దుబాటును సవరించడానికి అవసరమైన సవరణ జీవోల విడుదలలో జాప్యం అయింది.
సవరణ జీవోల జారీలో జాప్యంతో ఇబ్బందులు
ఏలూరు డీఈవో కార్యాలయం ఎదుట టీచర్ల ఆందోళన
ఏలూరు అర్బన్, మే 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తరగతిలో విద్యార్థుల సంఖ్య 49 దాటితే రెండో సెక్షన్ను మంజూరు చేయడంతోపాటు, ఆ మేరకు ఇప్పటికే జరిగిన సర్ప్లస్ పోస్టుల సర్దుబాటును సవరించడానికి అవసరమైన సవరణ జీవోల విడుదలలో జాప్యం అయింది. ఈవిధంగా ఏర్పడిన సంక్షోభాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు డీఈవో కార్యాలయం వద్ద టీచర్లు ఆందోళనకు దిగారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీచర్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు. సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం సవరణ జీవోలు జారీ చేసిన వెంటనే ఉమ్మడి జిల్లాలో బదిలీకి దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్/ సర్దుబాటు నుంచి తప్పిస్తామని, వారి ట్రాన్స్ఫర్ అప్లికేషన్లను రద్దుచేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు భరోసా ఇవ్వడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ల బదిలీలపై ప్రభుత్వం తొలుత జారీచేసిన జీవో ప్రకారం ఉమ్మడి జిల్లాలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల మేరకు సబ్జెక్టుల వారీగా టీచర్లను గుర్తించి, సంబంధిత పోస్టులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈవిధంగా సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లుగా మొత్తం 24మందిని విద్యాశాఖ గుర్తించింది. నిబంధనల ప్రకారం సర్ప్లస్ ఉపాధ్యాయులందరూ బదిలీకి దరఖాస్తుచేయడానికి శనివారం అర్ధరాత్రితో గడువు ముగుస్తుందని తొలుత ప్రకటించారు. అయితే విద్యార్థుల సంఖ్య 49 దాటినచోట్ల రెండోసెక్షన్ ఇచ్చేందుకు ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన చర్చల సందర్భంగా అంగీకారం తెలిపింది. కానీ ఇంతవరకు సవరణ జీవోలు విడుదల కాకపోవడంతో తొలుత గుర్తించిన 24మంది స్కూల్ అసిస్టెంట్లను తప్పనిసరిగా బదిలీ దరఖాస్తు చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ నేరుగా సంబంధిత టీచర్లకు శనివారం రాత్రి ఫోన్లుచేసి ఆదేశించడంతో సమస్య తలెత్తింది. రాత్రివేళ ఫోన్చేసి బదిలీ దరఖాస్తుకు ఒత్తిడి చేయడంపై యూటీఎఫ్ తీవ్ర అభ్యంతరం లేవనెత్తగా, ఆ మేరకు ప్రభుత్వంనుంచి సవరణ జీవోలు అందకపోవడం, బదిలీ దరఖాస్తు సమయం ముగిసిపోతుండంతో నిబంధనల ప్రకారం ఆయా ఉపాధ్యాయులను సంప్రదించామని విద్యాశాఖవర్గాలు వివరణ ఇచ్చాయి.
స్కూల్ అసిస్టెంట్ల అప్లికేషన్లు రద్దు : డీఈవో
డీఈవో కార్యాలయంలో అధికార, యూటీఎఫ్ వర్గాల నడుమ ఆదివారం కొద్దిసేపు వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. రెండో సెక్షన్పై సవరణ జీవోలు వచ్చిన వెంటనే సర్ప్లస్ పోస్టుల సర్దుబాటులో మార్పులు చేయడంతోపాటు, ఇప్పటికే బదిలీ దరఖాస్తు చేసుకున్న 24మంది స్కూల్ అసిస్టెంట్ల అప్లికేషన్లను రద్దు చేస్తామని డీఈవో వెంకటలక్ష్మమ్మ హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. చర్చల అనంతరం యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య 50కు రెండో సెక్షన్ను అమలు చేయడానికి, ఆ మేరకు గుర్తించిన సర్ప్లస్ పోస్టులను సరిచేయడానికి విద్యాధికారులు హామీ ఇచ్చారని వివరించారు. చర్చల్లో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు షేక్ముస్తఫా అలీ, విజయ రామరాజు, సుభాషిణి, పట్టాభిరామయ్య, రంగమోహన్, శ్రీధర్, కమల్కుమార్, రత్నరాజు, ప్రసాద్, మోహన్, ఆదినారాయణ పాల్గొన్నారు.