విద్యా సంస్థల బస్సులపై 36 కేసులు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:05 AM
ఏలూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మోటారు వాహనాల తనిఖీ అధికారు లు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ చెప్పారు.
ఐదు లక్షల 15 వేల 400 రూపాయల జరిమానా
ఏలూరు క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మోటారు వాహనాల తనిఖీ అధికారు లు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన 36 బస్సులపై కేసులు నమోదు చేసి ఐదు లక్షల 14 వేల 400 రూపాయల అపరాధ రుసుము విధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డీటీసీ షేక్ కరీమ్ మాట్లాడుతూ అన్ని విద్యా సంస్థల బస్సులు ఫిట్నెస్ లేకుండా నడపరాదని, డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తులు స్కూలు బస్సులు నడపరాదని అన్నారు. అటువంటి వారిని యజమాన్యాలు అనుమతించకూడదని, విద్యార్థులను సురక్షితంగా తీసుకువెళ్లాలని సూచించారు. విద్యార్థులను తరలించే విష యంలో నిబంధనలు పాటించని విద్యా సంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
స్కూలు, కాలేజీ బస్సుల తనిఖీలు
ఏలూరు క్రైం : విద్యార్థుల భద్రతలో ఎలాంటి అజాగ్రత్తలు ఉపేక్షించేది లేదని జాయింట్ యాక్షన్ అధికారుల బృందం స్పష్టం చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆదేశాలపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్య వేక్షణలో స్కూలు, కాలేజీ బస్సుల ఫిట్నెస్పై సంయుక్త తనిఖీ అధికారుల బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అవగాహన కల్పించారు. స్కూలు, కాలేజీ బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు తెలియజేశారు. ఫిట్నెస్ తప్పని సరిగా బస్సులకు ఉండాలని, టైర్లు, బ్రేకులు, హెడ్లైట్లు, ఎప్పటి కప్పుడు తనిఖీ చేయించాలన్నారు. బృందంలో ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.స్వామి, జి.ప్రజ్ఞ, సిబ్బంది పాల్గొన్నారు.