దిగొచ్చిన ఆర్టీసీ యాజమాన్యం
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:30 PM
ఏలూరు నగరంలోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో నిధుల దుర్విని యోగం వ్యవహారంపై ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చింది. బంకులో రూ.83 లక్షలు దుర్వినియోగం విషయంలో 14 మంది బాధ్యులైతే.. నలుగురి ఉద్యోగులనే సస్పెండ్ చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు ఉపక్రమించాయి.
ఉద్యోగుల సస్పెన్షన్పై మరో విచారణ
ఎండీ ద్వారకాతిరుమలరావు హామీ
12 రోజుల ఉద్యోగుల ఆందోళన విరమణ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఏలూరు నగరంలోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో నిధుల దుర్విని యోగం వ్యవహారంపై ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చింది. బంకులో రూ.83 లక్షలు దుర్వినియోగం విషయంలో 14 మంది బాధ్యులైతే.. నలుగురి ఉద్యోగులనే సస్పెండ్ చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు ఉపక్రమించాయి. 12 రోజులుగా వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఏలూరు డిపో ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారంతో తెరపడింది. జిల్లా పర్యటనలో భాగంగా జంగారెడ్డిగూడెం వచ్చిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ అంశంపై దృష్టి సారించారు. ఉద్యోగ సంఘాల నాయకులను విజయ వాడ రప్పించుకుని విషయం ఆరా తీసినట్టు సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర సంఘాలు బాధ్యత తీసుకుని ద్వారకాతిరుమలతో శుక్రవారం చర్చించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాఽధ్యులపై చర్యలు తీసుకుంటానని నాయకులకు ఎండీ హామీ ఇచ్చారని ఏలూరు డిపో జేఏసీ నాయకుడు వై.శ్రీనివాసరావు తెలిపారు. కాగా బంకు నిధులు దుర్వినియోగంలో 14 మందిపై అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో ఆరుగురికి సంబంధించిన సమాచారాన్ని డీపీటీవోకు అప్పగించారు. మిగతావారి నివేదికలను అందించాకే విచారణాధికారి నియామకాన్ని ఎండీ చేపట్టే అవకాశం ఉంది.