రైస్ కార్డులకు పచ్చజెండా
ABN , Publish Date - May 09 , 2025 | 12:29 AM
రాష్ట్రంలో రైస్కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.

అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
మార్పులు, చేర్పులు, చిరునామా మార్పులకు అనుమతి
ఏలూరు సిటీ, మే 8(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో రైస్కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. నూతన రైస్కార్డుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, దరఖా స్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్వీకరిస్తారని ఇటీవల పౌరసర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నూతన రైస్ కార్డుల జారీతో పాటు కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను కార్డులో చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం వంటి మొత్తం ఆరు రకాల సేవలను అందు బాటులోకి తీసుకొచ్చారు రైస్కార్డులో తప్పుడు ఆధార్ నెంబర్ సీడింగ్ను సరిచేసుకునే అవకాశం కల్పించారు.
కొత్తకార్డులు.. విఽధి విధానాలు
కొత్తగా రైస్కార్డు తీసుకునే వారికి విధివిధానాలను ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాలైతే నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్నవారు ఈ కార్డు పొందడానికి అర్హులుగా ప్రకటించారు. మూడెకరాలోపు వెట్ల్యాండ్ గాని, 10 ఎకరాలలోపు డ్రై ల్యాండ్ కాని, రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉండవచ్చు. నెలవారీ 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం చేసుకోవచ్చు. పింఛన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగ పెన్షనర్లు అన ర్హులు. అయితే పారిశుధ్య కార్మికులు మాత్రం రిటైర్డ్ ఉద్యోగులైనా కార్డు పొందేందుకు అవకాశం కల్పించారు. నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు ఈ కార్డు పొందడానికి అనర్హులు. అయితే ఉపాధి నిమిత్తం టాక్సీ, ట్రాక్టర్, ఆటో కలిగి ఉన్నప్పటికీ అర్హులుగా ప్రకటించారు. ఇన్కంటాక్స్ చెల్లించని వారు మాత్రమే కార్డు పొందడానికి అర్హులుగా ప్రకటించారు. ఇంటి స్థలం 1000 చదరపు గజాల లోపు ఉన్నవారే అర్హులు.
జిల్లాలో రైస్ కార్డుదారులు 6,20,146
జిల్లాలో ఇప్పటివరకు 6,20,146 మంది రైస్కార్డుదారులున్నారు. ఈ కార్డు లకు సంబంధించి 17,31,461 మంది సభ్యులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు 16,15,078 మంది సభ్యులు ఈకేవైసీ చేయించుకు న్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ అవసరం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో జిల్లాలో 25,030 మందికి ఈకేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అనాధాశ్రమాల్లో ఉండే వృద్ధులకు రైస్ కార్డు లేకపోతే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు, చేర్పులకు సంబంధించి మొత్తం ఆరు రకాల సేవలను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్లో స్మార్ట్ కార్డుల జారీ
జూన్లో క్యూఆర్ కోడ్తో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల జారీకి సన్నాహా లు చేస్తున్నారు. ఈ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవ చ్చు. ఆ కార్డుపై కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉంటాయి. ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయి. డేటా బేస్కు ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టం లో ఆటోమేటిక్గా డేటా అప్డేట్ అవుతుంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి.