Share News

ప్రజలకు మంచి సేవలందించండి

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:52 AM

రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాన కలిగి, ప్రజలకు మంచి సేవలందించాలని రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

ప్రజలకు మంచి సేవలందించండి
రెవెన్యూ అధికారులను సత్కరించిన కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ చట్టాలపై పూర్తి అవగాన కలిగి, ప్రజలకు మంచి సేవలందించాలని రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ డే కార్యక్రమంలో ఆమె సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఏటా జూన్‌ 20న రెవెన్యూ దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెవెన్యూ శాఖలో ఎక్కువ మొత్తంలో నవీకరణ విషయాలు ఉంటాయని, ఎప్పటికప్పుడు ఉద్యోగులు అప్‌డేట్‌ కావాలని సూచించారు. తెలియని విషయాలు నేర్చుకోవడంలో చిన్న, పెద్ద ఉద్యోగి భావన ఉండకూడదన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు తదితర సందర్భాలలో రెవెన్యూ శాఖ ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు నిబంఽధలు పాటిస్తూ మనసు పెట్టి పనిచేయాలన్నారు. శాఖకు సంబందించి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నారు. రెవెన్యూ శాఖలో రిటైర్డు ఉద్యోగులు తహసీల్దార్‌ లక్కు నరసింహారావు, పాంచజన్య మూర్తి, డీటీ బాబాజీ, వీఆర్వో బి.వెంకట సుబ్బారావు, ఆఫీస్‌ సబార్డినేట్‌ మణికంఠను సన్మానించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:52 AM