రబీకి..సన్నద్ధం!
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:59 PM
జిల్లాలో రబీ ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్దం చేసింది. ఈ ఏడాది రబీలో 96,567 ఎకరాల్లో వరి సాగు చేయాలని రబీ ప్రణాళికలో వ్యవసాయ శాఖ పేర్కొంది.
జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక ఖరారు
96,567 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం
4,828 ఎకరాల్లో నారుమళ్లు వేయాలని అంచనా
340 క్వింటాళ్ల విత్తనాలు .. 1,40,374 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం
రబీలో సాగు చేసే విత్తనాలు ఎంటీయూ 1121, 1153 రకాలు
ఏలూరుసిటీ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్దం చేసింది. ఈ ఏడాది రబీలో 96,567 ఎకరాల్లో వరి సాగు చేయాలని రబీ ప్రణాళికలో వ్యవసాయ శాఖ పేర్కొంది. రబీ సాగు చేసే మండలాల్లో 4,828 ఎకరాల్లో వరి నారుమళ్ళు వేయాల్సి ఉండగా 340 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంది. జిల్లాలో సార్వా వరి సాగులో వరి మాసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతుండగానే రబీ వరి సాగుకు రైతులు ఉపక్రమిస్తున్నారు.
రబీ సీజన్కు సంబంధించి 340 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని జిల్లా వ్యవ సాయ శాఖ రబీ ప్రణాళికలో పేర్కొంది. ఏపీ సీడ్స్తో పాటు సహకార సంఘాల్లో, ఇతర ప్రైవేటు డీలర్ల వద్ద ఈ విత్తనాలు లభ్యమ య్యే అవకాశాలున్నాయి. మేలు రకమైన విత్తనాలను సాగు చేస్తే అధిక దిగుబడులు రావడానికి అవకాశాలు ఉంటాయి. వ్యవ సాయ అధికారులు సూచించిన మేలు రక మైన వరి వంగడాలను సాగు చేస్తే దిగు బడులు లభించడంతో పాటు రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి.
రబీ సాగులో ఈ ఏడాది అనుకున్న స్థా యిలో వరి సాగు జరిగితే 3,09,014 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. లక్ష్యానికి మించి సాగు జరిగితే ఈ దిగుబడులు పెరిగే అవకాశాలు న్నాయి. వాతావరణం అనుకూలించి సాగు సక్రమం గా జరిగినా వరి దిగుబడులు ఆశించిన దాని కంటే పెరిగే అవకాశాలున్నాయి.
ఎరువులు సిద్ధం
రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో 1,40,374 మెట్రిక్ టన్నులు ఎరువులు అవ సరం కాగా ఇప్పటికే జిల్లాలో 44,759 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ రబీ ప్రణాళికలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా డిసెంబరు సంబంధిం చి జిల్లాకు 28వేల 738 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎరువులు అవసరం అవుతాయని ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. అంతకన్నా ఎక్కువగానే ఎరువులు నిల్వలు జిల్లాలో ఉన్నాయని ఆ ప్రణాళికలో జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇందులో మార్క్ఫెడ్లో 6,699 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల వద్ద 9,018 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 23,898 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్లు వద్ద 5,144 మెట్రిక్ టన్నుల ఎరు వులు నిల్వలు ఉన్నాయి. ఇందులో ప్రధా నంగా యూరియా 12,305 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,727 మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 17,865 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4,034 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి 6,828 మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచారు. రబీ సీజన్లో ఈ ఎరువులను రైతులు వినియోగించుకోవచ్చు.
60.49 శాతం వరి మాసూళ్లు పూర్తి
జిల్లాలో ఈ ఏడాది సార్వా సీజన్లో 2,07,286 ఎకరాల్వో వరి సాగు జరిగింది. ప్రస్తుతం వరి మాసూళ్ళ పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1,25,402 (60.49 శాతం) ఎకరాల్లో వరి మాసూళ్ళు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో వరి మాసూళ్లు పర్వం త్వరితగతిన పూర్తయితే రబీ వరి నారుమళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.