పోతునూరు సొసైటీలో అక్రమాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:19 AM
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రధాన అనుచరుడు, పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్ర వరప్రసాద్ (బజ్జీ)ను దెందులూరు పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రధాన అనుచరుడు నాగేంద్ర వరప్రసాద్ అరెస్ట్
లఏలూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రధాన అనుచరుడు, పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్ర వరప్రసాద్ (బజ్జీ)ను దెందులూరు పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సొసైటీలో భారీగా నిధుల స్వాహా వెలుగుచూసింది. 2022లో ఈ సొసైటీలో రూ.కోటి 54 లక్షలు అక్రమాలు వెలుగుచూశాయి. దీనిపై 51వ విచారణను సహకారశాఖ అధికారులు చేపట్టారు. అప్పటి కలెక్టర్ ప్రసన్నవెంకటేశ్ చర్యలకు ఆదేశించారు. ఆడిట్లోను పలు సంచలనాలు బయటపడ్డాయి. ఇప్పటికే సొసైటీ పరిధిలో డిపాజిట్దారులకు సకాలంలో మొత్తాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై డివిజన్ కో–ఆపరేటివ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన దెందులూ రు పోలీసులు ఆదివారం రాత్రి బజ్జీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో మిగిలిన అక్రమాలు జరిగిన సొసైటీల్లోనూ త్వరలోనే వేగవంతంగా చర్యలుంటాయన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. సహకార వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో కీలకమైన సొసైటీ అక్రమాలపై అధికారులు, పోలీస్ యంత్రాంగం చర్యలు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది.