Share News

పాపం.. ఆ అవ్వకు ఏమైందో..?

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:51 PM

భీమవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యనమదుర్రుపై చిన్న వంతెన పైనుంచి సోమవారం ఒక వృద్ధురాలు డ్రెయిన్‌లోకి దూకి గల్లంతైంది.

పాపం.. ఆ అవ్వకు ఏమైందో..?
చిన్న వంతెన వద్ద పోలీసుల గాలింపు చర్యలు

స్థానికులు వారిస్తున్నా కాలువలో దూకేసింది

యనమదుర్రులో వృద్ధురాలి గల్లంతు

రాత్రి వరకు లభ్యం కాని ఆచూకీ

భీమవరం క్రైం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): భీమవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యనమదుర్రుపై చిన్న వంతెన పైనుంచి సోమవారం ఒక వృద్ధురాలు డ్రెయిన్‌లోకి దూకి గల్లంతైంది. స్థానికుల కథనం ప్రకారం 1వ పట్టణం వైపు నుండి నడుచుకుంటూ వస్తున్న వృద్ధురాలు వంతెనపై చెప్పులు విడిచి డ్రెయిన్‌లో దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు కేకలు వేస్తున్నా ఆగకుండా ఆమె డ్రెయిన్‌లోకి దూకేసింది. కొంతసేపు డ్రెయిన్‌లో తేలియాడుతూ ఉండడంతో అటు వైపు వెళుతున్న స్థానికులు చూస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి ఆమె గల్లంతయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఆ వృద్ధురాలి ఆచూకీ దొరకలేదు. దీనిపై పోలీసులు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

ఇటీవల పెద్ద వంతెనకు ఇరువైపులా మునిసిపల్‌ శాఖ మెస్‌లు ఏర్పాటుచేసింది. దాంతోపాటు చిన్న వంతెనకు కొంత మేరే మెస్‌లు ఏర్పాటు చేశారు. పూర్తిగా మెస్‌లు ఏర్పాటు చేసి ఉంటే ఆ వృద్ధురాలు దూకడానికి ఆస్కారం ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. మెస్‌ లేకపోవ డంతో వృద్ధురాలు డ్రెయిన్‌లో దూకేసిందని అంటున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:51 PM