ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:15 AM
మెగా డీఎస్సీ– 2025 రిక్రూట్మెంట్ పరీక్షలు ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 6 నుంచి 30 వరకు మెగా డీఎస్సీ పరీక్షలు..
34,218 మంది అభ్యర్థులు – 44 సెషన్లు
ఏలూరు అర్బన్, జూన్ 2(ఆంధ్రజ్యోతి):మెగా డీఎస్సీ– 2025 రిక్రూట్మెంట్ పరీక్షలు ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి పశ్చిమలోని ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 44 సెషన్స్లో 34,218 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
సబ్జెక్టుల వారీగా పరీక్షలు : స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీజీటీ(నాన్ లాంగ్వేజెస్) పరీ క్షలకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ(లాంగ్వేజెస్) పరీక్షలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష వేళలను నిర్ణయించారు. ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టును ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, మధ్యా హ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సాయం త్రం 4 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. టెస్ట్ సెంటర్ సామర్ధ్యానికి అనుగుణంగా సెషన్కు 102 మంది నుంచి 211 మంది పరీక్షార్థుల వరకు హాజరయ్యేలా ఆయా రోజుల్లో విద్యార్థుల సంఖ్య ను నిర్ధారించారు. మొత్తం 44 సెషన్లలో నిర్వహిం చే ఆన్లైన్ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 34,218 మంది అభ్యర్థులు హాజరయ్యేలా ఖరారు చేశారు. టెస్ట్ సెంటర్ల సామ ర్ధ్యానికి అనుగుణంగా ఈ నెల 16 నుంచి 20 వరకు అభ్యర్థులను కేటాయించారు. మిగతా రోజుల్లో కొన్ని సెంటర్లలో పరీక్షలు ఉండవు. దివ్యాంగుల కోసం 14, 23 తేదీల్లో కొన్ని సెంటర్లను ప్రత్యేకించారు.
మొత్తం పోస్టులు : ఉమ్మడి జిల్లా 48 మండలాలు, మున్సిపాల్టీలు, ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో గవర్నమెంట్/ స్థానిక సంస్థల యాజమాన్యాల పాఠశాలల్లో 822 పోస్టులు, పురపాలక సంఘాల పరిధిలో 168, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 45 పోస్టులు కలిపి 1035 ఉపాధ్యాయ నియామకాలకు ఈ మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు హాల్ టిక్కెట్ల జారీ ఇప్పటికే ప్రారంభం కాగా, పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను వాటిపై ముద్రించారు.
పరీక్ష కేంద్రాలు.. సమయం
తాడేపల్లిగూడెం వాసవి, శశి, భీమవరం డీఎన్నార్(2), నరసాపురం స్వర్ణాంధ్ర, ఏలూరు సిద్దార్థ క్వెస్ట్ స్కూలు, సీఆర్ రెడ్డి, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలు.
ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో రెండు సెషన్స్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సెంటర్లోకి అనుమతించరు.