సమ్మె విరమించండి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:20 AM
మునిసిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొమ్మిది రోజులుగా కొనసాగుతోంది.
భీమవరం టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొమ్మిది రోజులుగా కొనసాగుతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో మునిసిపల్ కమిషనర్లు మంగళవారం ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని సూచిస్తున్నారు. లేకుంటే తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్న ట్లు సమచారం. సమ్మెలో ఉన్న సిబ్బంది మాత్రం తమకు రెండు రోజులు గడువు కావాలని, తమ నాయకులు చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగులకు నోటీసు లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాలోని 5 మునిసిపాల్టీలు, ఒక నగర పంచాయితీలో మొత్తం 290 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. భీమవరం 59, తాడేపల్లిగూడెం 83, పాలకొల్లు 25, నరసాపురం 55, తణుకు 56, ఆకివీడు–12 మంది ఉన్నారు. సమ స్యల పరిష్కారం కోరుతూ గత నెల 14 నుంచి సమ్మె చేస్తున్నారు. వారు విధులకు హాజరు కాకపోవడంతో ఇబ్బందు లు తలెత్తున్న నేపథ్యంలో సమ్మె విరమించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసినా అధికారుల సూచనల మేరకు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
ప్రధాన డిమాండ్స్ ఇవీ..
అత్యవసర విభాగంలోని నీటి సరఫరా, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్, టౌన్ ప్లానింగ్, సెక్యూరిటీ గార్డ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ అటెండర్స్, ఇంజనీరింగ్ అన్ని విభాగాల టెక్నికల్ ఉద్యోగులకు రూ.29,200, నాన్ టెక్నికల్కు రూ.24,500 జీతంఅమలు చెయ్యాలి.
10 ఏళ్లు సర్వీసు పూర్తయిన ఇంజనీరింగ్ మునిసిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలి.
ఆప్కాస్ను రద్దుచేసి కార్మికులను పర్మినెంట్ చెయ్యాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చెయ్యాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లు చెయ్యాలి
రిటైర్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.10 లక్షలు గ్రాడ్యుటీ, నెలకు రూ.10వేలు పింఛన్ ఇవ్వాలి.