ములపర్రు సొసైటీ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అరెస్ట్
ABN , Publish Date - May 21 , 2025 | 12:36 AM
ములపర్రు హిందూ ముస్లిం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 2018వ సంవత్సరంలోని డిపాజిట్లు గల్లంతు కావడంతో మరోసారి మంగళవారం కలకలం రేగింది.
రూ.2 కోట్లపైనే గోల్మాల్ : సీఐడీ అధికారుల విచారణ
పెనుగొండ, మే20 (ఆంధ్రజ్యోతి): ములపర్రు హిందూ ముస్లిం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 2018వ సంవత్సరంలోని డిపాజిట్లు గల్లంతు కావడంతో మరోసారి మంగళవారం కలకలం రేగింది. అనాటి అధ్యక్ష, కార్యదర్శులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో పాలకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు, అనాటి కార్యదర్శి వెంకటేశ్వరరావు నిధులు గోల్మాల్కు పాల్పడ్డారంటూ డైరెక్టర్లే ఆనాడు రోడ్డు ఎక్కారు. డిపాజిట్దారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి డిపాజిట్లు చెల్లించాలంటూ ప్రదక్షిణలు చేశారు. అప్పట్లోనే విచారణ జరిపి ఎంత మోసం జరిగిందో బయట పెట్టకుండా కాలం వెల్లబుచ్చారు. రూ.50 లక్షల నుంచి రూ.రెండు కోట్లు అంటూ రక రకాలుగా ప్రకటించేవారు. చివరకు డిపాజిట్దారుల ఒత్తిడి పెరగడంతో అప్పటి కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే స్థానికంగా ఉన్న పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకుని నగదు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. ఒక డిపాజిటట్దారుడు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి తేల్చాలంటూ సీఐడీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో విచారణ చేపట్టారు. విచారణలో రూ.రెండు కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని విచారణలో తేలింది. మంగళవారం మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి వెంక టేశ్వరరావులను తణుకులో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ములపర్రు సొసైటీ డిపాజిట్లు దుర్వినియోగం కేసు కలకలం రేపింది.