మాస్టర్ ఫ్లాప్
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:30 AM
ఎన్హెచ్–5 జాతీయ రహదారి వరకు మూడో కిలోమీటర్లు. 1981లో ఈ రహదారిని వంద అడుగులు ఉండేలా మాస్టర్ప్లాన్ రూపొందించారు
వైసీపీ నేత నిర్వాకం.. అభివృద్ధికి విఘాతం
గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెంలో వంద అడుగుల రోడ్డు.. 60 అడుగులకు కుదింపు
రహదారి కుదింపుతో 40 అడుగుల మార్జిన్ భూమి తమదేనంటున్న రెవెన్యూ అధికారులు
ఈ భూముల మీదుగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేమన్న మున్సిపాలిటీ
రెండు శాఖల మధ్య దోబూచులాట..
స్థల యజమానుల ఇబ్బందులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
తాడేపల్లిగూడెం పట్టణంలోని గణేశ్నగర్ జంక్షన్ నుంచి ఏపీ నిట్–నన్నయ్య పీజీ క్యాంపస్–శశి ఇంజనీరింగ్ కళాశాల మీదుగా ఎన్హెచ్–5 జాతీయ రహదారి వరకు మూడో కిలోమీటర్లు. 1981లో ఈ రహదారిని వంద అడుగులు ఉండేలా మాస్టర్ప్లాన్ రూపొందించారు. దీనిని 2021 మాస్టర్ప్లాన్లో 60 అడుగులకు కుదిస్తూ మునిసిపాలిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు వైపులా మార్జిన్లలోని విమానాశ్రయ భూములను మిగిల్చింది. ఈ మార్జిన్ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో అధికారులు ప్రయత్నాలు చేశారు. అదే జరిగితే వాటికి ఆనుకుని వున్న ప్రైవేట్ భూములకు రహదారి ఉండదు. దీనిని అడ్డం పెట్టుకుని వారి నుంచి ఆ వైసీపీ నేత లక్షలు దండుకున్నారు. మరోవైపు రహదారి మార్జిన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో పట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. ఇంత వరకు బాగానే వుంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. విమానాశ్రయ భూముల్లో 100 అడుగుల రహదారిని 60 అడుగులకు కుదించడంతో మార్జిన్లో ఇరువైపులా కలిపి40 అడుగులు మిగిలింది. గతంలో రహదారి పేరుతో మున్సిపాలిటీ ఆధీనంలో ఉండేది. ఇప్పుడా మార్జిన్ స్థలం రెవెన్యూ ఖాతాలోకి వెళ్లింది.
భవన ప్లాన్లకు బ్రేక్
విమానాశ్రయ భూముల రహదారికి ఇరువైపులా ప్రైవేటు భూములు వున్నాయి. ఏపీ నిట్ సమీపంలోని మూడు ఎకరాల భూమిని భవన నిర్మాణాల అభివృద్ధి కోసం బిల్డర్కు ఇచ్చారు. అపార్ట్మెంట్ నిర్మాణానికి అవసరమైన ప్లాన్ కోసం బిల్డర్ మున్సిపల్ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. రహదారి కుదించడంతో ప్రైవేటు భూమికి, మాస్లర్ ప్లాన్ రోడ్డుకు మధ్యలో మార్జిన్ స్థలం రెవెన్యూ శాఖది కాబట్టి ప్లాన్ ఇవ్వలేమంటూ మునిసిపాలిటీ అధికారులు తేల్చి చెప్పారు. మార్జిన్ స్థలంలో అప్రోచ్ ఇవ్వాలంటూ నిర్మాణదారులు రెవెన్యూ అధికారులను సంప్రదించారు. విమానాశ్రయ భూముల్లో అప్రోచ్ ఇవ్వలేమని ఆ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో నిర్మాణదారులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాన్ ఇవ్వడానికి సంబంధం వున్న రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్డీవోకు హైకోర్టు సూచించింది. మూడు రోజుల క్రితం నిర్మాణదారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఆర్డీవో సమావేశమయ్యారు. ప్లాన్పై చర్చించారు. మాస్టర్ ప్లాన్ రహదారిని 60 అడుగులకు కుదించడం వల్లే సమస్య ఏర్పడిందని ఆర్డీవో గుర్తించి ఎందుకిలా చేశారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. తాజాగా మాస్టర్ప్లాన్ రహదారికి, ప్రైవేట్ భూములకు మధ్య మార్జిన్లో ప్రభుత్వ భూములు ఉన్నందున ప్లాన్లు ఇవ్వలేమని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. ఈ సమస్యకు పరిష్కారానికి వైసీపీ హయాంలో కుదించిన రహదారిని విస్తరించినపుడే లభిస్తుంది. దీనిపై మున్సిపాలిటీనే చర్యలు తీసుకోవాలి. మాస్టర్ప్లాన్లో రైతులకు ఇబ్బంది లేకుండా వంద అడుగులకు మాస్టర్ప్లాన్ను విస్తరించాలి.
నాటి అభివృద్ధి.. నేడు ఏది ?
గణేశ్నగర్ జంక్షన్ నుంచి జాతీయ రహదారి వరకు విస్తరించి ఉన్న మూడు కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా వంద అడుగుల మాస్టర్ప్లాన్ రహదారి ఉన్నప్పుడు అభివృద్ధి చెందాయి. దీని ఆధారంగానే అనుమతులు మంజూరు చేశారు. మారిశెట్టి కల్యాణ మండపం, ఏపీ నిట్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, లయన్స్ క్లబ్బు భవనం, నన్నయ్య పీజీ క్యాంపస్, శశి ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అభివృద్ధి చెందాయి. తాజాగా 60 అడుగులకు కుదించటంతో నిర్మాణాలకు మధ్యలో మార్జిన్ ఏర్పడింది. ఆ భూమి అంతా రెవెన్యూ ఖాతాలో వచ్చి చేరింది. అంటే ఇప్పటి వరకు విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు వున్న రహదారి అంతా ఇప్పుడు అనధికారిమైంది. మున్సిపాలిటీ తప్పుడు నిర్ణయంతో రహదారికి ఇరువైపులా ఉండే ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలవుతున్నారు.