మావోయిస్టు సుధాకర్కు అంతిమ వీడ్కోలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:59 AM
పేదల హక్కుల కోసం అలుపెరుగని, అవిశ్రాంత సాయుధ పోరాటంతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న మావోయిస్టు కీలకనేత తెంటు సుధాకర్ విప్లవ జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నేతలు, రచయితలు కొనియాడారు.

భౌతికకాయంపై ఎర్రజెండా ఉంచి సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నేతల నివాళి
పెదపాడు, జూన్ 9(ఆంధ్రజ్యోతి): పేదల హక్కుల కోసం అలుపెరుగని, అవిశ్రాంత సాయుధ పోరాటంతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న మావోయిస్టు కీలకనేత తెంటు సుధాకర్ విప్లవ జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నేతలు, రచయితలు కొనియాడారు. ఈ నెల ఐదో తేదీ ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ మృతి చెం దారు. ఆయన స్వస్థలం పెదపాడు మండలం సత్యవోలు. ఆయన భౌతికకాయాన్ని ఇక్కడకు తీసుకువచ్చి సోమవా రం అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత ఆయన భౌతి కకాయంపై కమ్యూనిస్టు పార్టీల నేతలు ఎర్రజెండాను కప్పి విప్లవ గేయాలను ఆలపించారు. సుధాకర్ చేసిన పోరాటాలు, ఆయన ద్వారా పేదలకు జరిగిన లబ్ధిని గుర్తు చేశారు. ఆయుర్వేద వైద్య విద్యార్థిగా ఇంటి నుంచి దూర మై మావోయిస్టు జీవితంలో ఆఖరి శ్వాస వరకూ పేదల పక్షాన, వారి హక్కుల కోసం పోరా టం చేస్తూ ఊపిరి వదలడం కలిచివేస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన ఈ ప్రాంత వాసిని కడసారి చూసేందుకు గ్రామస్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన స్నేహితులు, సన్నిహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టరుపై ఆయన భౌతికకాయాన్ని ఉంచి ‘జోహార్ అమరజీవి సుధాకర్’ అంటూ నినాదాల నడుమ ఊరేగిం పుగా శ్మశాన వాటికకు తరలించారు. సుధాకర్ అన్న ఆనందరావు అంత్యక్రియలు నిర్వహించారు.