యండగండి కొట్టొద్దు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:24 AM
ఉండి మండలం యండగండి వద్ద వున్న సర్ప్లస్ వియ్యర్ ఛానల్, యండగండి లాకులు శిథిలావస్థకు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సర్ ప్లస్ వియ్యర్ చానల్, లాకులకు మరమ్మతులు చేయాలి
ఉండి, జూన్ 3(ఆంధ్రజ్యోతి):ఉండి మండలం యండగండి వద్ద వున్న సర్ప్లస్ వియ్యర్ ఛానల్, యండగండి లాకులు శిథిలావస్థకు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు మేజరు పనులు పూర్తి కాకపోతే వచ్చే వర్షాకాలంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. యండగండిలో ఉండి పంట కాలువను ఆనుకుని సర్ప్లస్ వియ్యర్ ఛానల్ నిర్మించారు. ఉండి పంట కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఇందులోని నీటిని వియ్యర్ ఛానల్ గేట్లను పైకెత్తి యనమదుర్రు డ్రెయిన్లోకి విడిచి పెడుతుంటారు. ఈ చానల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో చానల్ నుంచి నీరు బయటకు వెళ్లకుండా ప్రమాదం జరగకుండా ఇసుక బస్తాలను గత వర్షాకాలంలో పెట్టారు. పంట కాలువలో నీరు బయటకు విడిచిపెట్టడం కోసం ఈ చానల్ను ఏర్పాటు చేశారు. కానీ యనమదుర్రు డ్రెయిన్ పొంగి ప్రవహించిన దానిలో నీరు సరాసరి పంట కాలువలోకి చేరుతుంది. ఇది పెద్ద సమస్యగా మారింది. దీనిని అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.
యండగండి లాకులను 1885లో బ్రిటీష్ కాలంలో నిర్మించారు. అప్పటి నుంచి సమస్యలు వస్తే చిన్న చిన్న మరమ్మతులు తప్ప పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. గత వరదల్లో లాకులకు వున్న మూడు తలుపులకు ఒకటి తొలగించారు. నీటి ప్రవాహం వేగాన్ని అదుపు చేయడానికి ఆ రీతిగా చేశారు. లాకుల ఖానాకు తలుపును ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. రివిట్మెంట్లు బీటలు ఇచ్చాయి. వీటిని అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. వీటి వెంబడి పది నుంచి 15 వేల ఎకరాలు సాగవుతున్నాయి.
లాకులను అభివృద్ధి చేయండి
యండగండి లాకులను పూర్తి స్థాయి లో అభివృద్ధి చేయాలి. ఏటా సంభవి స్తున్న వరదలకు, తుఫాన్లకు ఈ లాకుల పరిస్థితి దారుణంగా వుంటుంది. లాకులను ఈ వేసవిలోనైనా అభివృద్ధి చేయాలి. లేకపోతే భారీ వర్షాలకు, తుఫాన్లకు లాకులు ప్రమాదస్థాయికి చేరతాయి. దీని వెంబడి వున్న వరి పొలా లు ముంపు బారిన పడుతున్నాయి. తద్వారా రైతులు నష్టపోతున్నారు. తక్షణమే అభివృద్ధి చేయాలి.
కొండపల్లి తవిటయ్య, రైతు
అభివృద్ధి పనులను చేపట్టాలి
యండగండిలో సర్ప్లస్ వియ్యర్ ఛానల్ అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేయాలి. పంట కాలువ ముంపు బారిన పడితే ఆ నీరు సర్ప్లస్ వియ్యర్ ఛానల్ నుంచి యనమదుర్రు డ్రెయిన్లోకి వెళ్లాలి. అయితే అందుకు విరుద్దంగా యనమదుర్రు డ్రెయిన్ పొంగి ప్రవహించి పంట కాలువలోకి నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది.
– పీవీఎస్ గోపాలకృష్ణంరాజు, రైతు