గ్రావెల్పై కన్ను!
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:35 AM
గ్రావెల్ కనబడిందా.. తవ్వేసేయ్.. ఇది నూజివీడు, ఆగిరిపల్లి మండలాలలోని వివిధ గ్రామాల్లో గట్లపై గ్రావెల్ అక్రమ క్వారీదార్ల నిర్వాకం.
(నూజివీడు ఆంధ్రజ్యోతి)
గ్రావెల్ కనబడిందా.. తవ్వేసేయ్.. ఇది నూజివీడు, ఆగిరిపల్లి మండలాలలోని వివిధ గ్రామాల్లో గట్లపై గ్రావెల్ అక్రమ క్వారీదార్ల నిర్వాకం. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ తదితర ప్రాంతాల్లో వెంచర్లకు గ్రావెల్ డిమాండ్ ఉండడంతో నూజివీడు నియోజకవర్గంలో విస్తారంగా గ్రావెల్ లభ్యమయ్యే గట్లపై గ్రావెల్ అక్రమార్కుల కన్ను పడింది. నూజివీడు మండలం దిగవల్లి తెల్లపొడుగట్టుకు సంబంధించి దాదాపు 15 రోజులుగా అక్రమ క్వారీ నిర్వహిస్తుండడతో సమీప గ్రామ వాసులైన హనుమంతులగూడెంకు చెందిన వారు అడ్డుకోవడంతో గతవారం క్రితం గ్రావెల్ తోలకాలు నిలిచాయి. అయితే తాజాగా శనివారం రాత్రి తిరిగి గ్రావెల్ తవ్వకాలకు అక్రమార్కులు తెరలేపడంతో గ్రామస్తులు వాహనాలను అడ్డుకునేందుకు స్థానిక మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసిన అక్రమార్కులు మీడియా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వాహనాలను అక్కడి నుంచి తరలించడం విశేషం. గ్రామ పంచాయతీకి క్వారీ ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉండగా గ్రావెల్ తోలకాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇటు గ్రామాలు సైతం ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో ఎటువంటి అక్రమాలు చేసిన కఠినంగా వ్యవహరిస్తానని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అధికార పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నా కొందరు అధికార పార్టీ నాయకులు వాటిని పెడచెవిని పెడుతూ గ్రావెల్ మట్ట తోలకాలను యథేఛ్ఛగా నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.