హెల్ప్లెస్ హ్యాండ్స్!
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:32 AM
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో విద్యార్థు లకు మెరుగైన భోజన సౌకర్యాలు అందించే క్రమంలో నూతన మెస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అది నూజివీడు ట్రిపుల్ క్యాంపస్లో బెడిసి కొడుతోం దని చెప్పవచ్చు. విద్యార్థులు ఆహారం కోసం రోడ్డెకుతున్నారు.
విద్యార్థుల సహకారంతో నడుపుతున్న సంస్థకు మాంసాహార వడ్డన కాంట్రాక్ట్
ట్రిపుల్ ఐటీలో విచిత్ర పరిస్థితి.. అర్ధాకలితో విద్యార్థులు.. నిరసన
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో విద్యార్థు లకు మెరుగైన భోజన సౌకర్యాలు అందించే క్రమంలో నూతన మెస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అది నూజివీడు ట్రిపుల్ క్యాంపస్లో బెడిసి కొడుతోం దని చెప్పవచ్చు. విద్యార్థులు ఆహారం కోసం రోడ్డెకుతున్నారు.
(నూజివీడు టౌన్–ఆంధ్రజ్యోతి)
ట్రిపుల్ ఐటీ క్యాపంస్లలో మెస్ల నిర్వహణపై వివాదాలు తలెత్తడంతో మెస్ కాంట్రాక్ట్ సమయం ముగిసిన అనంతరం దసరా సెలవులు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల క్యాంపస్ ల్లో మెస్ల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర అనుబంధ సంస్థకు అప్పగించింది. అయితే ఆ సంస్థ కేవలం శాఖాహారం మాత్రమే అందిస్తుండడంతో మాంసాహారం అందించే బాధ్యత ను మరో సంస్థకు అప్పగించే దిశగా ఆర్జీకేటి యాజ మాన్యం చర్యలు చేపట్టింది. మిగిలిన మూడు ట్రిపు ల్ ఐటీ క్యాంపస్లో మాంసాహారం అందించే బాధ్య తలను ఒక సంస్థ తీసుకోగా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మాంసాహారం అందించే బాధ్యతలను విద్యార్థుల సహకారంతో విద్యార్థుల కోసం నడపబడు తున్న సంస్థ అనుభవ రాహిత్యంతో మాంసాహారం అందించడంలో జరుగుతున్న లోపాలతో విద్యార్థులు అర్ధాకలితో ఉంటూ తిరిగి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆదివారం చాలీచాలని ఆహారంతో ఇబ్బంది పడుతున్నామంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మెస్ వద్ద నిరసనకు దిగడం విశేషం. దీంతో ఉలిక్కి పడ్డ క్యాంపస్ అధికారులు బయట నుంచి మాంసా హారాన్ని హుటాహుటీన తెప్పించి భోజన ఏర్పాట్లను చేసి విద్యార్థులను శాంతింప చేశారు.
నిబంధనలు తోసిరాజని
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ విద్యను అభ్యసిస్తున్న 6,400 మంది విద్యార్థులకు అదనంగా మరో రెండు వేల మంది శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్కు చెందిన వారు వసతి సౌకర్యాలను పొందుతున్నారు. వీరికి మాంసాహారం అందించాల్సిన బాధ్యత నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థుల సహకారంతో ఏర్పడిన ఎన్జీవో సంస్థ అయిన హెల్పింగ్ హ్యాండ్స్కు ఆర్జీయూకేటీ యాజమాన్యం అప్పగించింది. వాస్త వంగా ఆహార పదార్థాలను అందించాల్సిన సంస్థలకు నిబంధనల ప్రకారం లైసెన్సులతో పాటు క్యాటరింగ్ చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ హడావుడి నిర్ణయాలతో ఈ నిబంధనలను ఏమి పట్టించుకోకుండా అధికారులు విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదంటూ విద్యార్థుల సహకారంతో నడుస్తున్న సంస్థకే ఆహార పంపిణీ బాధ్యత అప్పగించడం మరింత వివాదానికి దారి తీసింది. ఒక వైపు ఆహార పంపిణీకి సంబం ధించిన అర్హతలు లేకపోవడం, మరోవైపు బిల్లుల చెల్లింపునకు సంబంధించి అవసరమైన జీఎస్టీ తదిత రాలు ఆ సంస్థకు లేవనే విషయాన్ని సైతం అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
హెల్పింగ్ హ్యాండ్స్ను ముంచేనా.. తేల్చేనా?
ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారుల నిర్ణయం విద్యార్థుల హెల్పింగ్హ్యాండ్స్ సంస్థను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఆ సంస్థలో ప్రతీ విద్యార్థి రూపాయి నుంచి పది రూపాయల వరకు పొదుపు చేసి వితరణగా అందించడం ద్వారా పేద విద్యార్థుల రవాణా సౌకర్యం, ఫీజులు చెల్లింపులో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కొందరి అత్యుత్సాహంతో ఎనిమిది వేల మందికి వండి వార్చే బాధ్యత తీసుకోవడంతో సంస్థ తీవ్ర నష్టాల వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ప్రతి విద్యార్థికి వారానికి ఐదు రోజులు గుడ్లు, ఒక రోజు మాంసాహారం అందించాలి. ఆదివారం ఒక్కరోజు మాంసాహారం అందించేందుకు దాదాపు 750 కేజీల మాంసం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఒక్కొక్క విద్యార్థికి రూ.6.70 పైసలు ఆర్జీయూకేటీ చెల్లిస్తుంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు సంస్థను నడుపుతున్న కొందరు ఫ్యాకల్టీ మాంసాహారం కొనుగోలును గణనీయంగా తగ్గించి కేవలం 600 కేజీలు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో విద్యార్థులకు ఆదివారం ఆహార కొరత ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విద్యార్థులతో చర్చలు!
మాంసాహార విషయంలో ఆందోళనకు దిగుతున్న విద్యార్థులతో నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆర్జీ యూకేటీ రిజిస్టర్ ఎస్.అమరేంద్రకుమార్ వ్యక్తిగత పనుల రీత్యా క్యాంపస్కు దూరంగా ఉండడంతో తిరిగి వచ్చాక బుధవారం విద్యార్థులతో చర్చించను న్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మాంసాహారం అందించే బాధ్యత నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ ఈ బాధ్యత నిర్వహించలేమని ఆర్జీయూకేటీకి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో వచ్చే వారం నుంచి మాంసాహారం అందించే బాధ్య త ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.