ముంచెత్తిన వాన
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:11 AM
తుఫాన్ ముప్పు తప్పింది. ఎండ బాగా కాస్తుంది.. ఇక వరి మాసూళ్లు చేసుకుందామని కోతలు చేపట్టిన రైతులకు సోమవారం ఒక్కసారిగా ముంచెత్తిన వర్షం మరింత కష్టాల్లోకి నెట్టింది.
తడిసిన ఎండబెట్టుకున్న ధాన్యం
తాడేపల్లిగూడెంలో డ్రెయిన్లు, రోడ్లు ఏకం
మోకాళ్ల లోతున నిలిచిన నీరు
ప్రజానీకం అవస్థలు
తాడేపల్లిగూడెం రూరల్/తాడేపల్లిగూడెం/పెంటపా డు/ఆచంట, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ముప్పు తప్పింది. ఎండ బాగా కాస్తుంది.. ఇక వరి మాసూళ్లు చేసుకుందామని కోతలు చేపట్టిన రైతులకు సోమవారం ఒక్కసారిగా ముంచెత్తిన వర్షం మరింత కష్టాల్లోకి నెట్టింది. ఒక పక్క నేలవాలిన పంటను అధిక వ్యయంతో కోతలు పూర్తి చేసి ధాన్యం ఎండబెట్టే పనిలో ఉన్న రైతులకు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి తడిసిపోయింది.మండలం ఎల్.అగ్రహారం, మాధవరం, జగన్నాధపురం, దండగర్ర తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించింది.
చెరువుల్లా రోడ్లు
సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తాడేపల్లిగూడెంలో రోడ్లకు, డ్రైన్లకు తేడా లేకుండా పోయింది. ఏ రోడ్డు చూసినా చెరువును తలపించింది. డ్రైనేజ్లో పేరుకుపోయిన సిల్ట్ను మున్సిపాల్టీ తొలగిం చలేదు. దీంతో ఒక్కసారిగా కురిసిన వానకు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డపైకి మురుగునీరు వచ్చింది. ఎక్కడ డ్రైనో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి. వాహన చోదకులు, పాదచారులు నానా అవస్థలు పడ్డారు. కడ కట్లకు వెళ్లే రోడ్డు నీటితో మునిగింది. చిన్న ఆంజేయ స్వామి గుడి నుంచి వివేకానంద జంక్షన్కు వెళ్లే మార్గం పూర్తిగా జల దిగ్భంధంగా మారింది. మసీదు
సెంటర్ నుంచి శేషమహ ల్ థియేటర్కు వచ్చే రోడ్డులో డ్రైన్తో కలిసిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్లో వర్షం నీరు చేరింది. వీకర్స్ కాలనీ, టిఎంపాడు, సీతా రాంపేట, యాగర్లపల్లి వంటి ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెంటపాడులో భారీ వర్షం కురసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావ రణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మారిపోయింది. 2.30 గంటల సమయానికి చిన్నగా మొదలైన వాన కుంభవృష్టిగా మారి గంటకు పైగా కురిసింది. భారీ వర్షానికి వీధులు జలమయంగా మారాయి. మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. ఆచంటలో సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి పోయింది. సుమారు గంట సేపు జోరువాన కురిసింది.